జగన్ పంచన చేరినా వల్లభనేని వంశీకి తప్పని తిప్పలు: ప్రత్యర్థుల పొగ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పంచన చేరినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అంత సజావుగా లేనట్లు అర్థమవుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పంచన చేరినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అంత సజావుగా లేనట్లు అర్థమవుతోంది. ఆయన సొంత నియోజకవర్గం గన్నవరంలో ప్రత్యర్థులు పొగ రాజేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత విధేయతలను మార్చుకున్నారు.
విజయం సాధించినప్పటి నుంచి వంశీ టీడీపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా ఆయన టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు. అందరూ ఊహించినట్లే ఆయన వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. సాంకేతికంగా మాత్రమే ఆయన వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీలో ఉన్నట్లే లెక్క
అయితే, వంశీ రాకను వైసీపీ నేత యార్లగడ్డ వర్గీయులకు అసలు రుచించలేదు. టీడీపీలో ఉన్నప్పుడు తనను వంశీ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని తీసుకోవద్దని ఆయన వైఎస్ జగన్ కు చెప్పుకున్నారు కూడా. అయితే, జగన్ మాత్రమే వంశీ భేటీకి అంగీకరించి, తన వైపు తిప్పుకున్నారు. యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు ఇచ్చి సంతృప్తి పరిచారు.
యార్లగడ్డ వర్గం కాస్తా సంతృప్తి చెందినప్పటికీ వంశీకి వ్యతిరేకంగా మరో వర్గం గన్నవరం నియోజకవర్గంలో పావులు కదుపుతోంది. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గంతో వంశీ వర్గానికి సఖ్యత సాధ్యం కావడం లేదు. వంశీకి తెలియకుండా దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి ఓ వర్గానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది
రెండు గ్రూపుల మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలో దుట్టా వర్గం జిల్లా ఇంచార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసింది. గన్నవరం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే తమ వర్గానికే టికెట్ ఇవ్వాలని కోరింది. వంశీకి తిరిగి టికెట్ ఇస్తే సహకరించబోమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వార్తలను దుట్టా వర్గం ఖండిస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే పెద్దిరెడ్డిని కలిసినట్లు చెబుతోంది. అయితే, వంశీకి దుట్టా వర్గం నుంచి పెద్ద యెత్తునే వ్యతిరేకత ఎదురు కావచ్చునని అంటున్నారు