అసెంబ్లీ స్పీకర్ గా రోజా: ఖరారైన మంత్రుల జాబితా ఇదే...
మంత్రివర్గ కూర్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు దశలుగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రానికి తుది జాబితా ఖరారవుతుందని భావిస్తున్నారు.
విజయవాడ: మంత్రివర్గ కూర్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు దశలుగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రానికి తుది జాబితా ఖరారవుతుందని భావిస్తున్నారు. తొలి దశలో 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
సామాజిక సమీకరణాలను, ప్రాంతాల వారీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జగన్ మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొంత మందికి ఇప్పటికే బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎస్సీల నుంచి ఇద్దరిని, ఎస్టీల నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. కాపు కోటాలో ఇద్దరికి అవకాశం కల్పించాలని చూస్తున్నారు.
హోంమంత్రిత్వ శాఖను కీలకంగా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ శాఖను ఎస్సీలకు లేదా ఎస్టీలకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినికిడి. ఈ సామాజికవర్గాలకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించడం ద్వారా దళిత వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయాలనేది జగన్ ఉద్దేశంగా చెబుతున్నారు.
జనరల్ కెటగిరీలో పోటీ ఎక్కువగా ఉండడంతో మంత్రి పదవుల పంపకం కాస్తా క్లిష్టంగా మారినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఉండడం ఆయనకు కాస్తా సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అందులోనూ చాలా మంది సీనియర్లు ఉండడం మరో తలనొప్పిగా భావిస్తున్నారు. ఈ స్థితిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి కేటాయించడం ఇబ్బందిగా ఉంది. దీంతో ఆమెకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నారు.
స్పీకర్ పదవికి ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పదవిపై ఆయనకు ఆసక్తి లేదని, తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారని అంటున్నారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రమే రోజాకు స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
మంత్రి పదవులు ఖరారైన వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మునిగంట మహీధర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. బొత్స సత్యనారాయణకు పరిశ్రమల శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నీటి పారుదల శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ, మహీధర్ రెడ్డి మున్సిపల్ శాఖ, ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రెండు రోజులకు శాఖలను కేటాయిస్తారని అంటున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డికి, కోన రఘుపతికి మధ్య మంత్రి పదవి విషయంలో పోటీ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డిని మంత్రిగా తీసుకుని దేవాదాయ శాఖను అప్పగిస్తే కోన రఘుపతిని టీటీడీ చైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయి. కోన రఘుపతిని మంత్రివర్గంలోకి తీసుకుంటే భూమనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వవచ్చు.
మహిళల కోటాలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. పాలకొండ ఎమ్మెల్యే కళావతికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మేకపాటి సుచరిత, తానేటి వనిత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్టీ కోటా నుంచి తెల్లం బాలరాజు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సుధాకర్ బాబును మంత్రివర్గంలోకి తీసుకుని సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించే అవకాశం ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఖరారైందని అంటున్నారు.
మైనారిటీల నుంచి తొలి విడత ఒక్కరికి అవకాశం దక్కవచ్చునంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఆంజద్ పాషా పేరు పరిశీలనలో ఉంది. మరో ఇద్దరు కూడా పోటీ పడుతున్నప్పటికీ ఆంజద్ పాషానే జగన్ ఎంపిక చేసుకోవచ్చునని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు కోటాలో జక్కంపూడి రాజా పేరు కూడా పరిశీలనలో ఉంది.
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే, తొలి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కే అవకాశం తక్కువేనని సమాచారం. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పినందున అంబటికి చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు. తుది జాబితా తయారు కానందున వీరిలో కొందరు అటూ ఇటూ కావచ్చు.