తుపానుగా మారనున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఖాయం. అల్లకల్లోలమే..
Rain Alert: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడం తీవ్రత పెరుగుతోంది. సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

తుపాను సన్నాహక సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను దిశ, వేగం, ప్రభావిత జిల్లాల పరిస్థితులపై తాజా నివేదికలను పరిశీలించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ — “ఏ ప్రాంతంలోనూ ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రజలను సమయానికి హెచ్చరించి, రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలి” అని ఆదేశించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. శనివారం నాటికి ఇది వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సోమవారం ఉదయం నాటికి ఇది నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు సంస్థ తెలిపింది.
శనివారం (అక్టోబర్ 25):
కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం (అక్టోబర్ 26):
గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం (అక్టోబర్ 27):
కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలి
ప్రఖర్ జైన్ ప్రజలకు, రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. “తీవ్ర వాయుగుండం సమయంలో బయటకు రావడం మానుకోవాలి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంటల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి,” అని సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 50–70 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు
కొనసాగుతోన్న వాతావరణ పరిశీలన
విపత్తు నిర్వహణ సంస్థ.. తుపాను కదలికలను ఉపగ్రహం, రాడార్ పద్ధతుల్లో నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమన్వయం కొనసాగిస్తూ, అవసరమైతే NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచింది. వర్షాల సమయంలో విద్యుత్ లైన్లు, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచిస్తున్నారు.