Nara Lokesh: ఆ సిటీ భవిష్యత్తులో ఏఐ నగరంగా మారనుంది.. లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: వైజాగ్ను ఐటీ హాబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా ఐటీ కంపెనీలు అన్ని కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. మరి ఆ వివరాలు ఇలా..

ఐటీ హబ్గా వైజాగ్
అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ను ఐటీ హబ్గా మారుస్తానన్నారు మంత్రి లోకేష్. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు మెటా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సిఫీ, యాక్సెంచర్ సుమారు 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఆయా కంపెనీలు వైజాగ్ వేదికగా డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
భవిష్యత్తు ఏఐ నగరంగా వైజాగ్
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వైజాగ్ను భవిష్యత్తు ఏఐ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, నోయిడా వంటి సిటీల మాదిరిగానే వైజాగ్ను దేశంలోని అతిపెద్ద టెక్ నగరాల్లో ఒకటిగా మారుస్తానని మంత్రి లోకేష్ గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసి సంగతి తెలిసిందే.
'99 పైసల' ధరకే ప్రభుత్వ భూమి
ఆ అంశంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్)కు అతి తక్కువ '99 పైసల' ధరకే ప్రభుత్వ భూమిని కేటాయించారు. మొదట్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. అలాగే ప్రతిపక్షం దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.
ఐటీ కంపెనీలు వైజాగ్లో పెట్టుబడులు
అయితే ఆ నిర్ణయం కారణంగానే ప్రముఖ ఐటీ కంపెనీలు వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్లకు ప్రోత్సాహకంగా అందించిన తర్వాత గూగుల్, సత్వా, యాక్సెంచర్ వంటి ఇతర కంపెనీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించడానికి ముందుకు వచ్చాయని ఆయన అన్నారు.
కేవలం 10 సంవత్సరాల్లోనే
వైజాగ్ గొప్ప ఫైనాన్షియల్ సిటీగా ఎదగడానికి ఇది మొదటి అడుగు అని లోకేష్ అన్నారు. ఇందుకు పూర్తి మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ 30 సంవత్సరాలలో సాధించిన టెక్నాలజీని.. వైజాగ్ కేవలం 10 సంవత్సరాల్లో సాధిస్తుందని లోకేష్ చెప్పారు.