- Home
- Andhra Pradesh
- lightning Alert : ఈ సాయంత్రం తస్మాత్ జాగ్రత్త... ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
lightning Alert : ఈ సాయంత్రం తస్మాత్ జాగ్రత్త... ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
lightning Alert : ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలకు ఈ సాయంత్రం ప్రమాదం పొంచివుందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆ ప్రమాదమేంటి? ఏఏ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ కు పొంచివున్న ప్రమాదం
lightning Alert : ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల ప్రజలు ఈ సాయంత్రం అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మేసి వాతావరణం మారిపోతుందని... వర్షం తక్కువగానే కురిసినా ఉరుములు మెరుపులతోపాటు భయంకరమైన పిడగులు పడే ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో పిడుగుల ప్రమాదం ఉందో ప్రకటించి ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ప్రజలు వర్షంకురిసే సమయంలో చెట్ల కింద ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇవాళ (సెప్టెంబర్ 30, మంగళవారం) సాయంత్రం ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులుపడే అవకాశం ఎక్కువగా ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది APSDMA. ఇలా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇలా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగుల ప్రమాదం పొంచివుంది... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇంకొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని... దీనికి పిడుగులు, ఈదురుగాలులు తోడయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఇలా అలర్ట్ చేసిన జిల్లాల్లో ప్రజలు వర్షం కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
ఏపీలో ఉప్పొంగుతున్న నదులు
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణాలతో పాటు ఇతర నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.50 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.31 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 6.16 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.62 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది... దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులకు చేరే అవకశాలున్నాయని.. ఈ వరదనీరు తగ్గేవరకు లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక గోదావరి నదిలో కూడా వరదప్రవాహం పెరుగుతోందని... భద్రాచలం వద్ద 49.80 అడుగులు, కూనవరం వద్ద 19.31 మీటర్లు, పోలవరం వద్ద 12.21 మీటర్లకు నీటిమట్టం చేరిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.