ఏపీలో మద్యంపై అనురాధ దీక్ష: జగన్ పై కేశినేని శ్వేత సంచలన వ్యాఖ్యలు
కరోనా కష్టకాలంలోనే మద్యం విక్రయాలను విచ్చలవిడిగా చేపడుతూ జగన్ ప్రభుత్వం జేట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతోందని టిడిపి నాయకురాలు కేశినేని శ్వేత ఆరోపించారు.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఓ వైపు రోజురోజుకు కరోనా విజృంభిస్తున్నా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్ మద్యం అమ్మకాలను ప్రారంభించారని టిడిపి నాయకురాలు కేశినేని శ్వేత ఆరోపించారు. కేవలం జే ట్యాక్స్ వసూళ్ళ కోసమే వైన్ షాప్స్ ను ఓపెన్ చేసి మద్యాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
మద్యం దుకాణాలు షట్ డౌన్ చేయాలని, మహిళల డిమాండ్లు నెరవేర్చాలంటూ కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్, టిడిపి నాయకురాలు గద్దె అనురాధ చేస్తున్న 12 గంటల నిరాహారదీక్షకు కేశినేని శ్వేత సంఘీభావం తెలిపారు.
అధికారంలోకి రావడానికి ముందు మద్యం బంద్ చేస్తామని... రుణాలు మాపి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు పేదలు, మహిళలను ఇబ్బందులు పడేలా ప్రవర్తిస్తుందన్నారు. సింహాసనం ఎక్కిన తరువాత ముఖ్యమంత్రి జగన్ మహిళలు ఇబ్బందులను పెడచెవిన పెట్టారని అన్నారు. వెంటనే మద్యం షాప్ లను మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కంటికి కనపడని వైరస్ తో రాష్ట్ర ప్రజలంతా యుద్దం చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం సరిగా అందడం లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్య కార్మికులు తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి సేవలు అందించారని... అయితే వారు చేసిన ఇన్నాళ కష్టం, త్యాగం మద్యం షాపులు తెరవడంతో బూడిదలో పోసిన పన్నీరైందని అన్నారు శ్వేతా.
నెలన్నర రోజులుగా పనులకు వెళ్లే అవకాశం లేక పూట గడవక ఆకలితో అలాంటిస్తున్న వాళ్లు కూడా ఇంట్లోని విలువైన వస్తువులను తీసుకెళ్లి అమ్మేసి మరీ మద్యం కొంటున్నారని తెలిపారు. మద్యం షాపులు తెరవడం కారణంగా ఇంట్లో గొడవలు అవడంతో కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను, మద్యం షాపులను తెరవద్దని పోలీసుల కాళ్లు పట్టుకున్న సంఘటనలను చూస్తున్నామన్నారు.ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కుటుంబాల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని...మద్యం వ్యసనానికి దూరంగా ఉండాలని కేశినేని శ్వేత ప్రజలకు సూచించారు.