- Home
- Andhra Pradesh
- Rain Alert: వానలే వానలు.. వరుస అల్ప పీడనలతో అల్లకల్లోలం, ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
Rain Alert: వానలే వానలు.. వరుస అల్ప పీడనలతో అల్లకల్లోలం, ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
కొన్ని రోజులుల బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. వరుస అల్ప పీడనలతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

చురుకుగా మారిన రుతుపవనాలు
గత కొన్ని రోజులుగా ఆగిన వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్లీ జోరందుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, వర్షాలు కురిసే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జల్లులు ప్రారంభమయ్యాయి. వాతావరణం మారుతుండటంతో వచ్చే రోజుల్లో వర్షాల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అల్పపీడనం ఏర్పడే అవకాశాలు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నెల 13వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్ప పీడనం పశ్చిమ దిశగా కదిలే సూచనలున్నాయి. ఈ అల్ప పీడనం కారణంగా తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్షాభావం నుంచి గట్టేక్కినట్లే
ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాలు వచ్చినప్పటికీ కొన్ని రోజుల వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈసారి కాలం సరిగా కాలేదని రైతులు ఆందోళన చెందారు. రాష్ట్ర అభివృద్ధి సంస్థ నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కేవలం 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది, ఇది సాధారణంగా ఉండాల్సిన 288.8 మిల్లీమీటర్ల కంటే తక్కువ. అయితే ఆగస్టు రెండో వారానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారాయి. ఉన్నట్లుండి వర్షాలు విస్తృతంగా కురిశాయి. కాగా ఈ నెల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయంటే
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం శుక్ర,శని, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
వింజమూరులో భారీ వర్షపాతం నమోదు
గురువారం నాటి వర్షాలతో వింజమూరు (నెల్లూరు జిల్లా)లో అత్యధికంగా 73.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కోనసీమ, కాకినాడ, ప్రకాశం, అనంతపురం, కడప, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. వచ్చే రోజుల్లో ఈ ప్రాంతాల్లో వర్షపాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.