కిలోల కొద్ది బంగారం, వెండి... తెలంగాణ నుండి ఏపికి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా
తెలంగాణ నుండి ఏపీకి తరలిస్తున్న కిలోల కొద్ది బంగారం, వెండితో పాటు భారీగా నగదు కృష్ణా జిల్లాలో పట్టుబడింది
విజయవాడ: అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం, వెండిని ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుండి ఏపికి వెళుతున్న ఓ వాహనాన్ని కృష్ణాజిల్లా తిరువూరు సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. ఎలాంటి పత్రాలు లేకుండా భారీస్థాయిలో తరలిస్తున్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శనివారం సాయంత్రం న్యూస్ పేపర్ రవాణా కారు తెలంగాణ నుండి ఏపిలోకి ప్రవేశించింది. అయితే వాహనంలోని వారు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో తిరువూరు చెక్ పోస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా భారీగా బంగారం, వెండి బయటపడింది.
అయితే తరలిస్తున్న వారి వద్ద వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 1 కేజీ 53 గ్రాముల బంగారం, 9కేజీల450 గ్రాములు వెండితో పాటు 53,28,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారును కూడా స్వాదీనం చేసుకుని వీటిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ అక్రమ రవాణాపై నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ...మొత్తం పట్టుబడిన నగదు, బంగారం విలువ 1,37,65,975 వుంటుందన్నారు. స్వాదీనం చేసుకున్న నగదు, నగలను మీడియా ముందు ప్రదర్శించారు. అయితే వీటిని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలు తెలియాల్సి వుందని... త్వరలోనే ఈ అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.