- Home
- Andhra Pradesh
- Diamonds : మీరు కూడా ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలా..? అయితే వెంటనే రాయలసీమకు వెళ్ళండి
Diamonds : మీరు కూడా ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలా..? అయితే వెంటనే రాయలసీమకు వెళ్ళండి
మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా? అయితే చాలామందిలా మీరు కూడా ఇప్పటికిప్పుడు రాయలసీమకు వెళ్లాల్సిందే. మీకు అదృష్టం కలిసొస్తే కోటీశ్వరుడు లేదంటే లక్షాధికారి కావచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రాయలసీమ కాదది రతనాల సీమ
Diamonds : రాయలసీమను రతనాల సీమ అని ఊరికే అనలేదు. అక్కడి మట్టిలోనే లక్షలు, కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలు దాగివున్నాయి. ఇలా రాయలసీమ మట్టిలో దొరికిన మాణిక్యాలతో ఓవర్ నైట్ లక్షాధికారులు అయినవారు ఉన్నారు... కొందరికి కోట్ల విలువైన వజ్రాలు కూడా దొరికాయి. ఈ వజ్రాలు ఎక్కడో గనుల్లో లభించడంలేదు.. రైతుల పొలాల్లోనే దొరుకుతున్నాయి. ప్రస్తుతం తొలకరి వానలు కురుస్తుండటంతో ఈ వజ్రాల వేట ప్రారంభమయ్యింది.
రాయలసీమ పొలాల్లో పంటలు కాదు వజ్రాలు పండుతున్నాయి
ఏదయినా మంచి జరిగితే, అదృష్టం కలిసివచ్చి జాక్ పాట్ తగిలితే 'వారి పంట పండింది' అంటారు. కానీ నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రం ఎప్పుడూ పంట పండదు.. అంటే అదృష్టం కలిసిరాదు. బంగారు పంటలు పండుతాయి అనేది ఉట్టిమాటే.. రైతులు ఎప్పుడూ ఆర్థికంగా వెనకబడే ఉంటారు. రాళ్ళ సీమగా పిలిచే రాయలసీమలో అయితే రైతుల పరిస్థితి మరీ దారుణం... ఇక్కడ సరైన వర్షాలుండవు, నీటిపారుదల సౌకర్యాలుండవు కాబట్టి సరిగ్గా పంటలు పండవు.
కానీ ఇదే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో ఏకంగా వజ్రాలు పండుతున్నాయి. మట్టిలో చేయిపెడితే చాలు లక్షలు, కోట్లు విలువైన రాళ్లు బైటపడుతున్నాయి. దీంతో వందలాదిమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లోకి దిగుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు రంగురంగు రాళ్లను సేకరిస్తున్నారు. వాటిలో వజ్రాలు ఉంటే వారి పంట పండినట్లే.
రాజలసీమ మట్టిలో మాణిక్యాలు
ఇలా రాయలసీమలోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో వజ్రాల కోసం ప్రజలు పొలంబాట పట్టడం కనిపిస్తోంది. ముఖ్యంగా కర్నూల్ జిల్లా తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర, పగిడిరాయి, పెరవలి మండలాల్లో వజ్రాలవేట సాగుతుంది. అలాగే అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్, ఎమ్మిగనూరు, కోసిగి మండలాల్లో కూడా పొలాల్లో విలువైన వజ్రాలు లభిస్తాయి. దీంతో వర్షాకాలం మొదలయి తొలకరి వానలు పడితే చాలు ఈ ప్రాంతాల్లో పొలాల్లో వజ్రాల కోసం వెతకడం ఓ సాంప్రదాయంలా మారిపోయింది.
వజ్రాల కోసం పొలాల బాట
కొందరు రైతులకు లక్షలు, కోట్ల రూపాయల విలువైన వజ్రాలు లభించడంతో ఇలా వజ్రాల కోసం పొలాల్లో వెతికేవారు ఎక్కువయిపోయారు. స్థానికులే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా కేవలం వజ్రాలను వెతకడానికి ప్రజలు వస్తుంటారు.. ఇదే ఓ పనిలా భావించి టిఫిన్ కట్టుకుని వచ్చిమరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉంటారు.. అదృష్టం ఉండి వజ్రం దొరికిందో డబ్బులే డబ్బులు. వజ్రాల వ్యాపారులు పొలాలవద్దకే వచ్చి కొనుగోలు చేస్తారంటే రాయలసీమలో ఈ వజ్రాల వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధంచేసుకోవచ్చు.
ఓవర్ నైట్ లో కోటీశ్వరుడైన రైతు
తాజాగా కర్నూల్ జిల్లా పెరవలిలో ఓ వ్యక్తికి రూ.30 లక్షల విలువైన వజ్రం దొరికినట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారి అతడికి పొలంలో దొరికిన విలువైన వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రైతుకు కూడా లక్షన్నర విలువైన వజ్రం లభించిందట. ఇలా కొందరికి ఇప్పటికే వజ్రాలు లభించగా తమకు కూడా అదృష్టం కలిసివస్తుందని భావించి వేలాదిమంది రాయలసీమ మట్టిలో మాణిక్యాల వేట కొనసాగిస్తున్నారు. మీరు కూడా అదృష్టం పరీక్షించుకోవాలంటే వెంటనే రాయలసీమకు వెళ్లాల్సిందే.