తగ్గిన కుప్పం మెజారిటీ: పార్టీ నేతలకు చంద్రబాబు చురకలు
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ తగ్గడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు నవ్వుతూనే చురకలు అంటించారు. అభివృద్ధి పనులే తనను కాపాడిందని... స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితో కొంప మునిగేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రధేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికలతో పోలిస్తే తక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒకానొక దశలో వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి కంటే బాబు వెనుకపడ్డారు.
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలతో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు. మెజారిటీ తగ్గడంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.
నియోజకవర్గంలోని కొందరు నేతల తీరు వల్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని పలువురు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి నియోజకవర్గ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మెజారిటీ నేతలు వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ట్రెండ్ మేరకే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ మెజారిటీ తగ్గిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజలకు దూరం కావడం వల్ల మెజారిటీ తగ్గిందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటే మెజారిటీ పెరిగేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. స్థానిక నేతల తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని కూడ బాబు అభిప్రాయపడ్డారు. అధికారం లేని సమయంలోనే మరింత క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాలను కైవసం చేసుకొనేలా వ్యూహ రచన చేయలాని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఈ నెలాఖరున నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నట్టు బాబు తెలిపారు. ప్రజలకు కూడ భరోసా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.