బాబు వద్దకు విజయనగరం పంచాయితీ: మీసాల గీతపై ఆశోక్ వర్గం పై చేయి
విజయనగరం జిల్లాలోని టీడీపీలో విభేదాలకు టీడీపీ తాత్కాలికం చెక్ పెట్టింది. కొత్త పార్టీ కార్యాలయం అవసరం లేదని తేల్చి చెప్పింది. మీసాల గీతపై ఆశోక్ గజపతిరాజు వర్గం పై చేయి సాధించింది.
విజయనగరం జిల్లాలోని టీడీపీలో చోటు చేసుకొన్న విబేధాలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొంది.
మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. మరో పార్టీ కార్యాలయం అవసరం లేదని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. మీసాల గీత ఏర్పాటు చేసిన కార్యాలయానికి బోర్డును తొలగించారు.
విజయనగరం జిల్లాలో ఆశోక్ గజపతి రాజు బంగ్లాలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈ నెల 9వ తేదీన విజయనగరంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఓ మాజీ ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. విజయనగరంలోని టీడీపీకి చెందిన కార్పోరేటర్లు కూడ కొందరు హాజరయ్యారు. ఈ విషయం టీడీపీలో పెద్ద చర్చకు దారి తీసింది.
మీసాల గీత మరో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై ఆశోక్ గజపతి రాజు వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి.
విజయనగరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను మీసాల గీత వర్గం పార్టీ నాయకత్వానికి వివరించింది. విజయనగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని తొలగించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
ఆశోక్గజపతిరాజు బంగ్లాలోని పార్టీ కార్యాలయాన్నే ఉపయోగించుకోవాలని నాయకత్వం సూచించింది. ఇదే విషయాన్ని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజయనగరం జిల్లా నేతలను కోరారు.
దీంతో విజయనగరంలో మీసాల గీత ఏర్పాటు చేసిన కార్యాలయానికి బోర్డును తొలగించారు. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పడినట్టుగా భావిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నారని సమాచారం. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆమె విజయనగరానికి వస్తారని తెలిసింది.
విజయనగరంలో మరో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా టీడీపీలో ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.
జిల్లాలో ఇప్పటివరకు ఆశోక్ గజపతిరాజు ఏం చెప్పినా అదే నడుస్తోంది. ఆశోక్ ఆధిపత్యాన్ని పార్టీ కార్యాలయం ఏర్పాటు ద్వారా మీసాల గీత సవాల్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
ఆశోక్ గజపతిరాజుతో గీతకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఈ సంఘటన తెలుపుతోంది. పార్టీ కార్యక్రమాల సమాచారం తెలియకపోవడంతోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్టుగా గీత ప్రకటించారు.