ఏపీకి భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు... ఈ రెండేళ్లలోనే సుదూర ప్రయాణం: వాణిజ్య ఉత్సవంలో సీఎం జగన్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహాత్సవ్ లో భాగంగా విజయవాడలో వాణిజ్య ఉత్సవ్-2021ను సీఎం జగన్ ప్రారంభించారు.
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరగనున్న వాణిజ్య ఉత్సవం-2021ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఎగుమతి దారులకు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ఇతర భాగస్వాములందరికీ సీఎం స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ విజయవాడలో... తర్వాత నాలుగు రోజులపాటు వివిధ జిల్లాల్లో జరుగుతాయని తెలిపారు. వారంరోజులపాటు వాణిజ్య సంబంధిత వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటాయి... అలాగే ప్రభుత్వం కూడా వారికి దగ్గరగా ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కీ అమృత్ మహాత్సవ్’లో భాగంగా వాణిజ్య ఉత్సవ్ను జరుపుకుంటున్నామని సీఎం వెల్లడించారు.
''గడచిన రెండేళ్లలో పెనుసవాళ్లను ఎదుర్కొన్నాం. ఆర్థిక మాంద్యం కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్య ఒక సంవత్సరంలో అయితే రెండో సంవత్సరం కోవిడ్ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవిన్యూ వసూళ్లు 3.38శాతం పడిపోయాయి. 2018–19 మధ్యకాలంలో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ. 20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో అవి రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి'' అన్నారు జగన్.
''దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధిరేటు 2018–19లో 6.3 శాతం ఉంటే అది 2019–2020 నాటికి 4 శాతానికి పడిపోయింది. తదుపరి ఏడాది మరింతగా క్షీణించి 2020–21 నాటికి –7.3 (మైనస్) శాతానికి పడిపోయింది' అని తెలిపారు.
''దేశం నుంచి ఎగుమతులు కూడా బాగా పడిపోయాయి. 330 బిలయన్ డాలర్ల విలువైన ఎగుమతులు అంటే 11.6 శాతంగా ఉన్న ఎగుమతులు... రెండేళ్ల కాలంలో 290 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశంలో ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం నుంచి ఎగుమతులు 19.4శాతం వృద్ధిచెందాయి. 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు వృద్ధిచెందాయి'' అన్నారు సీఎం జగన్.
''సముద్రపు ఉత్పత్తులు 15శాతం ఎగుమతులకు దోహదపడ్డాయి. షిప్, బోట్ల నిర్మాణాల రూపేణా 8.5శాతం, ఫార్మారంగం 7.3 శాతం, ఐరన్ మరియు స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతం ఎగుమతులకు దోహదపడ్డాయి. ఈ రంగాలన్నింటి వల్ల మొత్తంగా ఎగుమతులు 19.4శాతం పెరిగాయి. 2018–19లో ఎగుమతుల విషయంలో రాష్ట్రం 9వ స్థానంలో ఉండేది. 2019–20లో 7వ స్థానానికి, 2020–21లో 4వస్థానానికి చేరుకున్నాం'' అని సీఎం వివరించారు.
''రాష్ట్ర జీఎస్డీపీ కూడా కోవిడ్ సంవత్సరం 2020–21లో 2.58శాతం క్షీణిస్తే..., దేశ జీడీపీ 7.3శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాలు ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతికి, ఎగుమతుల వృద్ధికి ఈరెండు చాలా కీలకమైనవి'' అన్నారు.
''గడచిన రెండేళ్లకాలంలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పబడ్డాయి. తద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గడచిన రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. ఇదే కాకుండా రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాల కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గడచిన ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు చేయనున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి'' అని ముఖ్యమంత్రి తెలిపారు.
''దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్–బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఆర్థిక వృద్ధిరేటును పెంచడమే కాదు, పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి'' అని పేర్కొన్నారు.
''రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీళ్లు, ఎస్టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. రూ.20వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్షమందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.1730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. తద్వారా 25వేలమందికి ఉద్యోగాల కల్పనా సామర్థ్యం ఈఎంసీకి ఉంది'' అని తెలిపారు.
''ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ దృష్ట్యా 3మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం. రూ.13,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీ రాబోతోంది'' అని వెల్లడించారు.
''దీంతోపాటు నైపుణ్యలేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిలలో ఒక స్కిల్ యూనివర్శిటీని, ఒక స్కిల్ యూనివర్శిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్శిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధిచేయడంపై దృష్టిపెడితో మరో యూనివర్శిటీ ఐటీరంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి దృష్టిపెడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థుల నైపుణ్యాలను ఈ కాలేజీలు మెరుగుపరుస్తాయి. వారికి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి'' అన్నారు.
''దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో 5.8శాతం రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. 2030 నాటికి 10శాతం ఎగుమతులు రాష్ట్రం నుంచే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే మేం అడుగులు వేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి సమగ్రమైన మార్గదర్శక ప్రణాళిక కూడా వేసుకున్నాం'' అన్నారు సీఎం జగన్.
''రాష్ట్రానికి 974 కి.మీ. తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. మరో మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడుకు ఉత్తరాది రాష్ట్రాలు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. పోర్టుల ద్వారా రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు కలిపి ఏడాదిలో సుమారు 254 మిలియన్ టన్నులుగా ఉంది. మూడు కొత్త పోర్టుల వల్ల మరో 65 మిలియన్ టన్నుల సరుకురవాణా మొదటి దశలో వృద్ధి చెందుతుంది'' అని తెలిపారు.
''రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 25 సెకండరీ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు రావడమే కాదు, వ్యయసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 50 వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి'' అని సీఎం తెలిపారు.
''మరో 8 ఫిషింగ్హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. మా రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఉపాధికోసం గుజరాత్ వెళ్లాల్సిన పరిస్థితి. ఇంత పెద్ద సముద్రతీర ప్రాంతం ఉన్నా, హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2 విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.3,827 కోట్లు ఖర్చుచేస్తున్నాం. 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాదు, మరో 35వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఐస్ప్లాంట్లు, కోల్డు స్టోరేజీలు, చేపలు, మరియు రొయ్యల ప్రాససింగ్, మార్కెటింగ్ వస్తాయి. తద్వారా ఎగుమతులు పెరగడానికి అవకాశాలు పెరుగుతాయి'' అన్నారు.
''ఈ కష్టకాలంలో పారిశ్రామిక వేత్తలు చూపిస్తున్న అంకిత భావానికి, ఎగుమతిదారులకు, వాణిజ్య మండళ్లకు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాణిజ్య ఉత్సవానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. పారిశ్రామిక వేత్లల్లో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా, ఏపీతో పాటు వృద్ధిచెందేలా మరింత మందిని పోత్సహిస్తుంది'' అని ఆశాభావం వ్యక్తం చేశారు.
''ఎలాంటి సహకారం కావాలన్నా మేం అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే.. మాకు సూచనలు చేయండి... కచ్చితంగా వాటిని చేస్తాం'' అని పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రివెల్లంపల్లి శ్రీనివాస్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు.