కేసీఆర్ ఇంటికెళ్లిన జగన్, చంద్రబాబుకేమో ఫోన్: టీడీపీ మంట అదే
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకొన్నారు
ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబునాయుడు చర్చించారు.
ఈ నెల 30వ తేదీన తన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్ ఫోన్ చేశారు. కానీ, చంద్రబాబు నాయుడు ఆ సమయంలో జగన్ ఫోన్ కు అందుబాటులోకి రాలేదు.
ఇదే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి జగన్ ఆహ్వానించారు. కానీ, చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయడంపై పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకొచ్చారు.
జగన్ స్వయంగా వచ్చి ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లే విషయమై ఆలోచిస్తే బాగుంటుండేదని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే జగన్ను టీడీపీ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపాలని నిర్ణయం తీసుకొన్నారు. జగన్కు అభినందనలు తెలుపుతూ ఓ లేఖను కూడ ఈ ప్రతినిధి బృందం ఇవ్వనుంది.
జగన్ వద్దకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వెళ్లనున్నారు.గురువారం నాడు ఉదయం విజయవాడలోని జగన్ ఇంటికి వెళ్లి ఈ బృందం అభినందించనుంది. జగన్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.
2014లో చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరుకాలేదు. ఆ తర్వాత రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కూడ జగన్ దూరంగా ఉన్నారు.
ఈ సమయంలో జగన్ వద్దకు టీడీపీ మంత్రుల బృందాన్ని చంద్రబాబు పంపారు. అయితే జగన్ మాత్రం మంత్రుల బృందాన్ని కలుసుకోలేదు. ఈ విషయమై రెండు పార్టీల మధ్య పరస్పరం తీవ్ర విమర్శలు చోటు చేసుకొన్నాయి.