Asianet News TeluguAsianet News Telugu

జూన్ 21న సూర్య గ్రహణం: తెలంగాణ, ఆంధ్రల్లో సమయాలు ఇవీ...

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కనిపించును. చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును, డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .

Solar Eclipse 2020: Surya Grahan On 21st June
Author
Hyderabad, First Published Jun 4, 2020, 11:10 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Solar Eclipse 2020: Surya Grahan On 21st June
 
తేదీ 21 జూన్ 2020  ఉదయం 11: 58  శ్రీ శార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం, మృగశిర - 4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశిలో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో చూడామణి నామ సూర్యగ్రహణం సంభవించనున్నది.

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కనిపించును. చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును, డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు, మిథునరాశి వారు ఈ గ్రహణం చూడరాదు.

తెలంగాణ రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం  10:14
గ్రహణ మధ్యకాలం : ఉదయం 11: 55 
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 44 
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.

ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10: 23 
గ్రహణ మధ్యకాలం : మధ్యహ్నం 12: 05
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
గ్రహణ నియమాలు.  

గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 8 :00 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 9 :15  గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధునరాశి వార , మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్ర జాతకుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణపట్టు, విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

సూర్య గాయత్రి - ఓం ఆదిత్యాయచ విద్మహే మహా శుభగాయచ ధీమహి తన్నోఆదిత్య ప్రచోదయాత్.

గ్రహణం రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని దేవత విగ్రహాలను, యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు, యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు, ఎక్కడ చేయకూడదు. ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి. ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి.

ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు, మల, మూత్ర విసర్జన చేయకూడదు అనే భయాందోళనలు పడవద్దు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం. ఏదైనా అవసరాల కొరకు ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి.

ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప, దానాదులను చేసుకోవాలి. ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం, గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన గ్రాసం తినేప్పుడు గో మాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటికి, వ్యాపార సంస్థలకు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను, పట్టికను, కలబందను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజింప జేసుకుని ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి. గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి, కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి, కాబట్టి తిరిగి మనకు మన కుంటుబ సభ్యుల కొరకు ఇంటికి మరియు వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కొత్తగా రక్షణ కట్టుకోవాలి.

శుభఫలం:- మేష, సింహ, కన్య , మకరరాశులకు 

మధ్యమఫలం:- వృషభ, తులా, ధనుస్సు, కుంభరాశులకు 

అధమ ఫలం:- మిథున, కర్కాటక, వృశ్చిక, మీనరాశులకు వారికి అధమ 'అరిష్ట' ఫలం. 

ముఖ్యంగా మిథునరాశి, అనారోగ్యం ఉన్నవారు, గోచార శని ప్రభావ పీడితుల వారు తప్పకుండా గ్రహణదోష నివారణ శాంతి చేయించుకోవాలి. ఇదే పద్దతిని ద్వాదశ రాశుల వారు అనుసరిస్తే మరీ మంచిది.

గమనిక:- శాస్త్ర సూచనలను విమర్శన దృష్టితో చూడకుండా మన కొరకు మన పూర్వీకులైన ఋషులు తమ అనుభవాన్ని జోడించి  విపత్తులను అధిగమించడానికి సూచించిన సూచనలను పాటిస్తే మేలు జరుగుతుంది. గత సంవత్సరం అనగా 26 డిసెంబర్ 2019 లో  సూర్య గ్రహణం ధనస్సురాశిలో ఏర్పడినప్పుడు షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడటం, దాని వలన ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం వాటికి తగిన శాంతుల చేసుకోవాలని సూచించడం జరిగింది. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ యావత్  ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కాబట్టి  అందరూ కూడా ఈ సమయంలో సూర్య భగవానుడికి తగిన శాంతులు చేసి కరోనా మరియు ఉపద్రవాల నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం. ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావ ఫలితాలు ఎలా ఉండ బోతున్నాయి అనేది ఇంకో వ్యాసంలో తెలియ జేయడం జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios