నా ప్రాంత అభివృద్ధి కోసమే స్టూడియో.. విమర్శలపై `యాత్ర 2` దర్శకుడు కౌంటర్..
ఇన్నేళ్ల చిత్ర పరిశ్రమ రాయలసీమ కోసం ఏం చేసిందని ప్రశ్నించారు దర్శకుడు మహి వీ రాఘవ్. తనకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాలు కేటాయించడంపై విమర్శల నేపథ్యంలో దర్శకుడు కౌంటర్ ఇచ్చాడు.
![yatra 2 director mahi v raghav counter to criticism on ap government issued two acres for studio arj yatra 2 director mahi v raghav counter to criticism on ap government issued two acres for studio arj](https://static-ai.asianetnews.com/images/01hnz44decmbkbnyy9h08nvd7t/screenshot-2024-02-06-170936-png_363x203xt.jpg)
దర్శకుడు మహి వీ రాఘవ్ ఇటీవల `యాత్ర2` సినిమాతో వచ్చాడు. గురువారం విడుదలైన ఈ మూవీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. వైఎస్జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర ప్రధానంగా రూపొందింది. వైఎస్ అభిమానులకు మాత్రమే అనేలా ఉంది. అయితే సినిమా కంటే ఇప్పుడు దర్శకుడు మహి వీ రాఘవ్ బాగా ట్రెండింగ్లోకి వస్తున్నారు. హాట్ టాపిక్గా మారారు. ఆయనకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాలు ఇచ్చిందనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. మదనపల్లిలో హర్సిలీ హిల్స్ లో స్టూడియో కోసం ఆయనకు ల్యాండ్ని కేటాయించినట్టు వార్తలు వార్తలు వచ్చాయి.
దీనిపై తాజాగా దర్శకుడు మహి వీ రాఘవ్ స్పందించారు. ఆయన దీనిపై వివరణ ఇచ్చాడు. తన ప్రాంతం అభివృద్ధి కోసం తాను స్టూడియో కట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం తమ వారికి ఇచ్చినట్టుగా యాభై ఎకరాలు, వంద ఎకరాలు ఇవ్వలేదని, కేవలం రెండు ఎకరాలు మాత్రమే తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా దీన్ని వ్యతిరేకించే వారికి, ఆ మీడియాకి చురకలు అంటించారు. తన ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో స్టూడియో నిర్మిస్తున్నట్టు చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, నా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం లేకపోతే ఏ హైదరాబాద్లోనో, వైజాగ్లోనే స్టూడియో కట్టుకోవాలని స్థలం అడుగుతాను. కానీ వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటా అని ప్రశ్నించాడు. `నేను రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా దాదాపు 16ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 2008లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. మూన్ వాటర్ పిక్చర్స్, త్రీ ఆటమ్ లీవ్స్ అనే బ్యానర్స్ ని స్థాపించి `విలేజ్ లో వినాయకుడు`, `కుదిరితే కప్పు కాఫీ`, `పాఠశాల`, `ఆనందో బ్రహ్మ`, `యాత్ర`, `సిద్దా లోకం ఎలా ఉంది`. `యాత్ర 2` సినిమాలతోపాటు `సేవ్ ది టైగర్స్`, `సైతాన్` వెబ్ సిరీస్లను రూపొందించాను.
నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా, అక్కడే చదివాను. సినీ పరిశ్రమలో రాయలసీమ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అక్క షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరు. నా ప్రాజెక్ట్స్లో `ఆనందో బ్రహ్మ`, `సేవ్ ది టైగర్స్` లు తప్ప `పాఠశాల`, `యాత్ర 2`, `సిద్ధా లోకమెలా ఉంది`, `సైతాన్ వెబ్` సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించాను. ఈ రెండేళ్లలో `సైతాన్`, `యాత్ర 2`, `సిద్ధాలోకం` అనే మూడు ప్రాజెక్ట్స్ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. మూడు ప్రాజెక్ట్స్కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయలను ఖర్చు చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా షూటింగ్ చేశాను. అక్కడ సినిమాలు చేయటం వల్ల లాడ్జీలు, హోటల్స్, భోజనాలు, జూనియర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించాను. అందుకే రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా, దాని వల్ల లోకల్ జనాలకు ఉపయోగంగా ఉంటుందని భావించాను` అని చెప్పారు మహి వీ రాఘవ్.
ఆయన ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసే వారిపై ఫైర్ అయ్యారు. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎకరాలు అడగలేదు. నేను కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నాను. దాని వల్ల అక్కడెవరైనా షూటింగ్స్ చేసుకోవాలనుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అందులో తప్పేముందని ప్రశ్నించారు. చేయనివారు ఎలాగూ చేయరు. ఇన్నేళ్లు ఇండస్ట్రీ ఉంటుంది కదా, రాయలసీమకు ఎవడైనా ఏమైనా చేశారా! ఎవరూ ఏమీ చేయలేదు, చేసే వారిని చేయనివ్వరు అన్నారు. వాళ్లకి ప్రియమైన ప్రభుత్వం వాళ్లకు నచ్చినవాళ్లకు, ఇష్టమైన వాళ్లకు భూములను ఇచ్చుకుంది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నేను నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో, అక్కడి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డాడు దర్శకుడు.