మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం తన లేటెస్ట్  అవుటింగ్ దస్ కా ధమ్కీ గ్రాండ్ సక్సెస్‌ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.


మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.21గా ఒక చిత్రం రూపొందనుంది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రతిభ గల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.

YouTube video player

హీరో గా విశ్వక్‌ సేన్‌కి ఇది 11వ చిత్రం. నేడు(మార్చి 29) విశ్వక్‌ సేన్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటల 16 నిమిషాలకు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌ మెంట్‌ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతం నుంచి సరుకుతో ఉన్న మూడు లారీలు బయల్దేరి పోర్టుకి వెళ్తుంటాయి. రాజమండ్రిలోని గోదావరి వంతెనను కూడా వీడియోలో చూపించారు. అలాగే ఒక పడవపై ఉన్న రేడియోను గమనించవచ్చు. '

'సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో.. బ్లాక్‌ ఉండదు, వైట్‌ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది'' అంటూ వీడియోను చాలా ఆస్తికరంగా రూపొందించారు. దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనున్న పీరియాడిక్‌ ఫిల్మ్‌ అనిపిస్తోంది. ఇక ''మాస్‌ కా దాస్‌ 'బ్యాడ్‌' గా మారాడు'' అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. 

ఎంతో ఇంటెన్స్‌ తో రూపొందించిన ఈ వీడియోలో యువన్‌ శంకర్‌ రాజా నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల 'దాస్‌ కా ధమ్కీ'తో అలరించిన విశ్వక్‌ సేన్‌.. పవర్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.