Asianet News TeluguAsianet News Telugu

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే `మా` పోటీ నుంచి తప్పుకుంటాః మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్స్.. సొంత డబ్బుతో `మా` బిల్డింగ్

ఈ సారి `మా` అధ్యక్షుడిని ఒక్కరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను `మా` అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటానని హీరో మంచు విష్ణు అన్నారు. `మా` బిల్డింగ్‌ నిర్మాణానికి అయ్యే ప్రతి ఖర్చు తాను, తన ఫ్యామిలీ భరిస్తుందని వెల్లడిచారు.

vishnu manchu intresting comments on maa elections he said build maa building his own money  arj
Author
Hyderabad, First Published Jul 12, 2021, 7:22 PM IST

చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, మురళీమోహన్‌, మోహన్‌బాబు ఇలా సినీ పెద్దలు ఈ సారి `మా` అధ్యక్షుడిని ఒక్కరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను `మా` అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటానని హీరో మంచు విష్ణు అన్నారు. అంతేకాదు `మా` బిల్డింగ్‌ నిర్మాణానికి అయ్యే ప్రతి ఖర్చు తాను, తన ఫ్యామిలీ భరిస్తుందని వెల్లడిచారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సారి(2021-23)కిగానూ `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) అధ్యక్షుడి కోసం ఐదుగురు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్‌ రాజ్‌,మంచు విష్ణు, జీవిత, హేమ్‌, సీవీఎల్‌ నర్సింహరావు బరిలో ఉన్నట్టు వెల్లడించారు. ప్రకాష్‌ రాజ్‌ తన 27 మందితో కూడిన ప్యానెల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు మన `మా`ని మనమే సరిదిద్దుకుందామని వెల్లడించారు. దీంతో `మా` ఎన్నికల రసవత్తరంగా మారాయి. లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్య ముందుకొచ్చింది. అలాగే రాజకీయ పార్టీల ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు స్పందించి ఓ వీడియోని విడుదల చేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ, `పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క `నడిగర్ సంఘం` మాత్రమే ఉండేది. మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 'తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా వుంటూ చాలా మంచి పనులు చేస్తూ 'తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ని అద్భుతంగా నడిపారు. 

ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం, 1993లో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా)ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు, చిరంజీవి గారు మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు 'మా' పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.

 1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మన సినీ కార్మికులకి నివాసం కల్పిద్దాం అని ఒక స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, నాన్న గారికి ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరుపున అప్పటి గవర్నర్ రంగరాజన్ గారిని కలిసి ఒక పిటిషన్ సబ్మిట్ చేసి ఆ స్థలాన్ని సినీ కార్మికులకి చెందేలా చేసారు. అదే ఇప్పుడు మనకున్న చిత్రపురి కాలనీ.

ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులకు ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం జరిగింది. 2015లో దాసరి నారాయణ రావు గారు, మురళీ మోహన్ గారు ఇద్దరు కలిసి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని అడిగితే, ఆ రోజు నాన్నగారు అడ్డుపడి  ఇప్పుడే ఈ వయసులో ఎందుకు అని నన్ను వద్దని గురువు గారికి సర్ది చెప్పారు.

ఇంతకు ముందు ఉన్న మురళీ మోహన్ గారు, నాన్న గారు, నాగబాబు గారు, రాజేంద్రప్రసాద్ గారు, శివాజీ గారు మంచి పనులు చేశారు. ప్రస్తుతం ఉన్న నరేష్ గారైతే కరోనా పాండమిక్‌ సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్ట్ లకి  అండగా నిలబడి వాళ్ళకి ఇన్సూరెన్స్ లు, పెన్షన్స్ లాంటివే కాకుంటే, తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఇలా ప్రతి ప్రెసిడెంట్ మన `మా` మెంబర్‌ కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేసారు.

 `మా` అసోషియేషన్‌లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు అని అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్ళి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం.నా బ్రదర్ సునీల్ నటుడిని ఒక సందర్భంలో కలిసినప్పుడు నాకొక మాట చెప్పాడు. 'ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు గారిని కలువు, ఆయన నీకు హెల్ప్ చేస్తారు' అని తోటి నటీనటులు చెప్పారని, అలానే నాన్న గారిని కలిసానని, సమస్య పరిష్కారం అయ్యిందని చెప్పాడు.

 మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా  ఉండి, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి అటెండ్ అయిన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ, `మా` అసోసియేషన్‌ కోసం కట్టించబోయే బిల్డింగ్ కి  అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తాము అని చెప్పాను. 

పది పన్నేండేళ్లుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరు అంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరిగే ప్రతి `మా` ఎలక్షన్స్ అదే ప్రధాన అజెండాగా వినిపిస్తుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. `మా` బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తాను. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ ని నేను నిర్మిస్తాను. మన దృష్టిలో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాదు. ఆ టాపిక్ కి  ఇక ఫుల్స్టాప్ పెడదాం.

 ఇక మన సినీ ఆర్టిస్ట్స్ ఫేస్ చేస్తున్న రియల్ ఇష్యూస్ మీద మనం దృష్టి పెడదాం. ప్రజెంట్ మన మూవీ ఇండస్ట్రీ గోల్డెన్ ఫేజ్ వైపు నడుస్తుంది. ఎన్నో కొత్త కొత్త ఓటీటీలు, సినిమాలు, యూట్యూబ్ ఛానల్స్ అంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకచోట పని దొరుకుతుంది. మన ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళ వాళ్ళ యూనియన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే సినిమాల్లో పని చేయాలి, కానీ ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నదేమిటంటే.. మెంబర్షిప్ లేని చాలా మంది పనిచేస్తున్నారు. మెంబర్షిప్ ఉన్నవారికి పని లేదు. కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేద్దాం తప్పులేదు. కానీ సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు `మా` మెంబర్ అవ్వాల్సిందే. ఇది మొదటి రూల్‌. 

 
ఇలా expand అయిన మన  `మా` ఫ్యామిలీ మెంబర్స్ అందరు గురించి ఒక brochure తయారు చేసి ప్రతి ప్రొడక్షన్ హౌస్, OTTS కి పంపి మన మెంబర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి `మా` అసోషియేషన్‌ కి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉండాలి. భారతదేశంలో ఉన్న అన్ని సినీ అసోసియేషన్స్ తో  మన `మా` గట్టి సంబంధాలు కలిగి ఉండాలి. మనం విస్తరించాలి. `మా` బలపడాలి, మనమంత నిర్మాతలకు సహకరించాలి. నిర్మాతలు లేకపోతే మనం లేము. ఇది ప్రతి నటుడు గుర్తుంచుకోవాల్సిన విషయం.

నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, సత్యనారాయణ గారు, నాన్న గారు, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజేంద్రప్రసాద్ గారు, కోట శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని `మా` కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం. వాళ్ళ సలహాలు పాటిస్తాం. మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి `మా` ప్రెసిడెంట్ గా   నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా` అని తెలిపారు. 

ఇప్పుడు మంచు విష్ణు వ్యాఖ్యలతో `మా` ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటీవల మురళీమోహన్‌ ఈ సారి `మా`అధ్యక్షుడు ఏకగ్రీవం అవుతారని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మంచు విష్ణు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడంతో ఎన్నికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios