విశాల్ నామినేషన్ తిరస్కరించిన ఈసీ
- జయ మరణంతో ఆర్ కే నగర్ లో ఉపఎన్నిక
- ఉపఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన హీరో విశాల్
- విశాల్ నామినేషన్ తిరస్కరించిన ఈసీ
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ ఉపఎన్నికల బరిలో నిలుస్తూ తమిళ హీరో విశాల్ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది.
సోమవారం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ సెంటర్కు వెళ్లిన విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శమని ప్రకటించిన విశాల్.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్ ప్రజలను కోరాడు.
స్వతంత్ర్య అభ్యర్థి విశాల్ నామినేషన్ వేసేందుకు అక్కడికి చేరుకోగా.. భద్రతా సిబ్బంది మిగతా స్వతంత్రులను లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కూడా తమలాగే మాములు వ్యక్తి అని.. అతని కోసం ఎదురు చూడాల్సిన అవసరం తమకు లేదంటూ వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ఫ తోపులాట కూడా జరిగింది.
డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున దినకరన్, బీజేపీ తరపున అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న మాస్ హీరో విశాల్ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందనుకుంటే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంతేకాక జయ మేనకోడలు దీప నామినేషన్ కూడా తిరస్కరించడంతో ఉపఎన్నిక క్షణక్షణం రసవత్తరంగా మారుతోంది.