విశాల్ ప్రస్తుతం `మార్క్ ఆంటోని` చిత్రంలో నటిస్తున్నారు. ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు విశాల్.
హీరో విశాల్ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయన షూటింగ్లో గాయపడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే అనేకసార్లు ఆయన ప్రమాదాల బారిన పడ్డారు. తాజాగా ఏకంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తన కొత్త సినిమా షూటింగ్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. షూటింగ్ సెట్లో చోట చేసుకున్న ఘటన ఇప్పుడు అందరిని షాక్కి గురి చేస్తుంది.
విశాల్ ప్రస్తుతం `మార్క్ ఆంటోని` చిత్రంలో నటిస్తున్నారు. ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో ట్రక్ అదుపు తప్పింది. సెట్లో కింద పడిపోయిన విశాల్ వైపు అదుపు తప్పి ట్రక్ వేగంగా దూసుకొచ్చింది. ట్రక్ వస్తుండటాన్ని గమనించిన టీమ్ మెంబర్స్ ఆయన్ని పక్కకి లాగారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే జరగరాని ఘోరం జరిగే ప్రమాదం పొంచి ఉంది. కానీ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు విశాల్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
`కొద్ది క్షణాలు, కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ గాడ్, ఈ ప్రమాదం తర్వాత రక్షణ వాతావరణంలో తిరిగి షూటింగ్లో పాల్గొన్నాం` అని తెలిపారు విశాల్. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. దీనిపై అభిమానులు స్పందిస్తున్నారు. ఏం కాలేనందుకు రిలాక్స్ అవుతున్నారు. టేక్ కేర్ అంటూ సూచిస్తున్నారు. మరోవైపు నటుడు దీపక్ పరదేశ్ స్పందిస్తూ, చూడ్డానికే ఇది చాలా భయంకరంగా ఉంది. నీకేం కాలేదు, అదే చాలు. అంతా క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాం` అని రిప్లైగా ట్వీట్ చేశారు.
గతంలో విశాల్ `లాఠి` సినిమా సమయంలోనే గాయపడ్డారు. షూటింగ్లో ఆయన కాలుకి నిజంగానే గాయమైంది. అంతకు ముందు `చక్ర` సినిమా సమయంలోనే యాక్షన్స్ చేసే క్రమంలో తలకి గాయమైంది. ఇలా తరచూ విశాల్ గాయాల బారిన పడుతున్నారు. అయితే ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా చేయడమే అందుకు కారణమని అంటున్నారు. నటుడిగా తన కమిట్మెంట్ని చాటుకునేందుకు ఆయన డూప్ లేకుండా చేస్తున్నారని ఆయన టీమ్ సభ్యులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం విశాల్ నటిస్తున్న `మార్క్ ఆంటోని` చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్తోపాటు గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
