పాక్ పై చిరస్మరణీయ విజయం... కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన రాజమౌళి, ఎన్టీఆర్!
ఉత్కంఠ పోరులో భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించింది. అద్భుత బ్యాటింగ్ తో జట్టును విజయతీరానికి చేర్చిన కోహ్లీ హీరో అయ్యాడు. దేశవ్యాప్తంగా కోహ్లీ పేరు మారుమ్రోగుతుంది. కాగా రాజమౌళి, ఎన్టీఆర్ క్రికెటర్ కోహ్లీని ప్రశంసిస్తూ... ట్వీట్స్ చేశారు.
భారత్-పాకిస్తాన్ పోరంటేనే ఇరు దేశాల అభిమానుల్లో టెన్షన్ మొదలవుతుంది. మ్యాచ్ సైతం అలానే సాగుతుంది. వరల్డ్ కప్ 20-20 టోర్నమెంట్ లో నేడు పాకిస్తాన్ తో భారత్ తలపడింది. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్ నరాల తెంచేసింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక విజయం అసాధ్యమే అనుకుంటున్న తరుణంలో కోహ్లీ, హార్దిక్ పాండ్య క్రీజులో నిలదొక్కుకున్నారు. మంచి భాగస్వామ్యంతో టార్గెట్ కి చేరువయ్యారు. చివర్లో రెండు వికెట్స్ తీసి పాక్ భారత్ ని ఒత్తిడిలోకి నెట్టింది. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టాడు.
ఆసియా కప్ లో ఎదురైన పరాభవానికి భారత్ బదులు తీర్చుకుంది. 53 బంతుల్లో 82 పరుగులు చేసి విరాట్ కోహ్లీ కీలక మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ ఇన్నింగ్స్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ లిస్ట్ లో దర్శకధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కూడా చేరారు. ''కింగ్ కోహ్లీ... మీకు వందనాలు'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక ఎన్టీఆర్... ''అద్భుతమైన రన్ ఛేజ్, కోహ్లీతో పాటు టీం సభ్యులు తమ ప్రయత్నంతో మరపురాని విజయాన్ని అందుకున్నారు'' అని ట్వీట్ చేశారు.
టాలీవుడ్ కి చెందిన మరికొందరు హీరోలు కోహ్లీ, టీం ఇండియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు. అక్టోబర్ 21న జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కుటుంబ సమేతంగా ఈ ముగ్గురు అక్కడకు వెళ్లడం జరిగింది.