విజయ్ దేవరకొండ చేతిలో మరో బిగ్ ప్రాజెక్ట్.. రంగంలోకి `ఫ్యామిలీ మ్యాన్` దర్శకులు..?
ఇటీవల `లైగర్` దెబ్బతో డిజప్పాయింట్లో ఉన్న విజయ్ దేవరకొండ ఓ కొత్త సినిమాకి సైన్ చేశాడు. ఆయన ఓ బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు సమచారం.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం విఫలమైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన `లైగర్` చిత్రం డిజాస్టర్గా నిలిచింది. ఈ దెబ్బతో పూరీతో చేయాల్సిన `జనగణమన` కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి నిర్మాతలు బ్యాక్ అయ్యారని సమాచారం. దీంతో విజయ్, పూరీ సైతం దీన్నిపక్కన పెట్టారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరో భారీ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ హీరోగా `ఫ్యామిలీ మ్యాన్ 2` దర్శకులు ఓ సినిమా చేయబోతున్నారని, ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని, ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని తెలుస్తుంది. `లైగర్` చిత్రం తర్వాత `ఫ్యామిలీ మ్యాన్ 2` దర్శకులు రాజ్, డీకేలు ఇటీవల విజయ్ని కలిసి ఓ కథని నెరేట్ చేశారట. ఈ కథకి విజయ్ బాగా ఇంప్రెస్ అయ్యారట. దీంతో వెంటనే ఓకే చెప్పారట. అయితే విజయ్ ఓ సినిమాని అశ్వినీదత్ బ్యానర్(వైజయంతి మూవీస్)లో చేయాల్సి ఉంది. అందుకోసం ఈ స్టోరీని నిర్మాత వద్దకి పంపగా, అశ్వినీదత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఇలా విజయ్ దేవరకొండ హీరోగా, రాజ్ డీకేల దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. రాజ్ డీకేలు తెలుగు వారే కావడం విశేషం. రాజ్ నడిమోరు, కృష్ణదాసరి కొత్తపల్లి(డీకే) ఇద్దరిది చిత్తూరు జిల్లానే. కానీ బాలీవుడ్లో రాణించేందుకు చాలా కాలం క్రిందటే వెళ్లారు. అక్కడ డిజిటల్ కంటెంట్ అందిస్తూ రాణిస్తున్నారు. ఇటీవల `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. వీరి దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమపై పడింది. ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగింది. బిగ్గెస్ట్ కంటెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. దీంతో ఈ ఇద్దరు తెలుగులో సినిమాలు చేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సమంత కథానాయికగా నటిస్తుంది. `మహానటి` తర్వాత విజయ్, సమంత కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. దీనికితోడు ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటం విశేషం. ఇది పూర్తికాగానే రాజ్ డీకేల మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. మరోవైపు రాజ్ డీకేలు `ఫ్యామిలీ మ్యాన్ 3`కి కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.