రాత్రి `బేబీ` ప్రీమియర్స్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. సినిమా చూశాక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కన్నీళ్లు, నవ్వులు అంటూ ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. అయినా తన తమ్ముడి కోసం వచ్చాడు. గురువారం రాత్రి `బేబీ` ప్రీమియర్స్ లో పాల్గొని సందడి చేశారు. సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమా చూశాక ఎమోషనల్ ట్వీట్ చేశారు. కన్నీళ్లు, నవ్వులు అని పేర్కొన్నారు. తన తమ్ముడు `బేబీ` హీరో ఆనంద్ దేవరకొండని, హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్యని రెండు చేతులతో గట్టిగా హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు విజయ్.
`బేబీ` సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పిల్లలు(ఆనంద్, వైష్ణవి) అద్భుతం చేసి చూపించారు. సినిమా చాలా బాగుంది. చాలా ప్రభావం చూపించేలా ఉంది. ప్రీమియర్స్ ల త్వాత గత రాత్రి ఇది మేము. చాలా కన్నీళ్ల తర్వాత మేమంతా పెద్దగా నవ్వుకున్నాం. అంతా నవ్వులతో నిండిపోయింది` అంటూ తెలిపాడు విజయ్. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్, విరాజ్ అశ్విన్లు మిస్సింగ్ అంటూ పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.
అంతకు ముందు రాత్రి విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, `రేపట్నుంచి ఇది మీ అందరికి అస్తవ్యస్తమైన సమయం కానుంది. కానీ అంతా ప్రారంభం కాకముందే, మీ అందరిని ప్రేమిస్తున్నాను, బేబీ సినిమా విషయంలో చాలా గర్వంగా ఉంది` అని వెల్లడించారు విజయ్. నేటి నుంచి ఈ సినిమా రచ్చ చేయబోతుందనేది ఆయన ఉద్దేశ్యంగా ఇందులో పేర్కొన్నారు. అన్నట్టుగానే ఈ సినిమా రచ్చ చేస్తుంది. ఓవర్సీస్లో దుమ్మురేపుతుందని తెలుస్తుంది. ఆనంద్ దేవరకొండకి ఊహించిన ఓపెనింగ్స్ ని ఈ సినిమా తీసుకురాబోతుంది. చిన్న చిత్రాల్లో పెద్ద హిట్గా నిలబోతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు దర్శకుడు సాయి రాజేష్. నేటి యువత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా అమ్మాయిలను ప్రతిబింబించారు. ట్రెండీగా తీసుకెళ్లారు. పలు క్రేజీ సీన్లతో కుర్రాళ్లకి పిచ్చెక్కించారు. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. అదే సమయంలో ఎమోషనల్గానూ ఉంటుంది. హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల హీరో ఆనంద్ దేవరకొండ సైతం తన సంతోషాన్ని పంచుకున్నారు.
