మంచో చెడో బేబీ మూవీ చర్చకు దారి తీసింది.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ బేబీ. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా భారీ సక్సెస్ కొట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో బేబీ కలెక్షన్స్ కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా ప్రేమికుడిగా, తమ్ముడు సక్సెస్ చూసిన అన్నయ్యగా చాలా హ్యాపీ. నేను జులై 13న నేను బేబీ ప్రీమియర్స్ చూశాను. అందరూ నా రెస్పాన్స్ కోసం వెయిటింగ్. కానీ నేనేమీ మాట్లాడలేకపోయాను. గొంతు పట్టుకుపోయింది. మాటలు రాలేదు. మొదటిసారి నేను హీరో అనే భావన మర్చిపోయి ప్రేక్షకుడిగా సినిమాఎంజాయ్ చేశాను.
మంచో చెడో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. డిబేట్స్ పెడుతున్నారు. అంటే సాయి రాజేష్ ఒక బలమైన కథ చెప్పారని, అది ఎంతగానో ప్రభావితం చేసిందని అర్థం అవుతుంది. సొసైటీల్లో ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. అలా అని అందరూ అలాంటి అమ్మాయిలే ఉన్నారని కాదు. అబ్బాయిల్లో కూడా ఉన్నారు. నాకు మాత్రం అందమైన మనసున్న అమ్మాయిలే తారసపడ్డారు.
ఈ మూవీలో ప్రేమికులు ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పారు. నా తమ్ముడు నటుడు అవుతానంటే చాలా కష్టం అని చెప్పాను. నటన అంత ఈజీ కాదు. నా అనుభవం నేపథ్యంలో అదే చెప్పాను. నా దగ్గరకు చిన్న విషయం కూడా తీసుకురాడు. బేబీ మూవీ కథ కూడా నాకు చెప్పలేదు. సొంతగా ఎదగాలని నేను కోరుకున్నాను అదే చేస్తున్నాడు. మారుతి ఎస్ కె ఎన్ ని నిర్మాతను చేస్తే.. ఎస్ కె ఎన్ సాయి రాజేష్ కి దర్శకుడిగా లిఫ్ట్ ఇచ్చాడు. ఒకరికొకరు అందిస్తున్న సహకారం గొప్పది.
నటుడు విరాజ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇక వైష్ణవి చైతన్య అద్భుతం చేసింది. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. అందరికీ ఆల్ ది బెస్ట్. సాయి రాజేష్ నెక్స్ట్ ఎలాంటి కథ చేస్తాడనే ఆసక్తి కలుగుతుంది. అతను మరిన్ని విజయాలు సాధించాలి, అన్నారు. కాగా విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఖుషి చిత్రంతో ఆడియన్స్ ని పలకరించనున్నారు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది.