ఎవడి మాట వినేది లేదు కొట్లాడుకుందాం.. నెగిటివ్ ట్రెండ్స్ పై విజయ్ దేవరకొండ కౌంటర్
ఎవడు మాట వినేది లేదు కొట్లాడుదాం అంటూ కౌంటర్ వేశాడు విజయ్ దేవరకొండ. లైగర్ మూవీ విషయంలో చేస్తున్న నెగిటివ్ ట్రెండ్స్ పై పరోక్షంగా స్పందించారు. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్ గా మారింది.
హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అనేక మార్లు వార్తలకెక్కింది. ఈ ప్రవర్తనే ఆయనపై నెగిటివిటీకి కారణం అవుతుంది. ఐతే ఈ తరహా ప్రవర్తన పిచ్చగా ఇష్టపడే వారు కూడా ఉన్నారు. ఈ రేంజ్ ఫాలోయింగ్ వెనుక కారణం అదే అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే... సోషల్ మీడియాలో లైగర్ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ఓ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. నెటిజెన్స్ ఈ సినిమాను బహిష్కరించండి అంటూ ప్రచారం చేస్తున్నారు.
తన మూవీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ పరోక్షంగా కౌంటర్ వేశాడు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ''మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేది లేదు.... కొట్లాడుకుందాం'' అంటూ ఓ డైలాగ్ పోస్ట్ చేశాడు. విజయ్ ట్వీట్ చూస్తే మీరెంత నెగిటివ్ ప్రచారం చేసినా భయపడేది లేదన్నట్లు ఉంది. ఈ సినిమా కోసం మేము కష్టపడ్డాం... ఖచ్చితంగా విజయం సాధిస్తామని విశ్వాసం ప్రకటించినట్లు కూడా ఉంది.
నేపోటిజం కారణంగానే సుశాంత్ మరణించారని భావిస్తున్న నెటిజెన్స్ నుండి... అలియా భట్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అనన్య పాండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కరణ్ జోహార్ లైగర్ సహ నిర్మాత కాగా, అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. మరికొన్ని ఇతర కారణాలతో లైగర్ ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో లైగర్ కి సపోర్ట్ గా మరొక వర్గం రంగంలోకి దిగారు. ఐ సప్పోర్ట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ తో పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇటీవల లాల్ సింగ్ చడ్డా ను బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ నెగిటివ్ ప్రచారానికి తోడు ఆ చిత్రానికి బ్యాడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. ఈ క్రమంలో నెగిటివ్ ట్రెండ్స్ లైగర్ టీంని భయపెడుతున్నాయి.