వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ప్రకటన.. ఫుల్ యాక్షన్తో `సైంధవ్`..
విక్టరీ వెంకటేష్ మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆయన `హిట్` దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు.
విక్టరీ వెంకటేష్ రూట్ మార్చాడు. ఇప్పుడు యాక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాడు. ఫ్యామిలీ సినిమాలతో అలరిస్తున్న వెంకీమామ ఇప్పుడు రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఆ సినిమా టైటిల్ని ప్రకటించారు. `హిట్` ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంధవ్` అనే చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర టైటిల్ని, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్.
ఇందులో వెంకటేష్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన చంద్ర ప్రస్థ అనే ఓడరేపు ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి బైక్ పై ఉన్న ఓ బాక్స్ని ఓపెన్ చేశాడు. అందులో మెడిసిన్ వైల్ ఉంది. అది తీసుకుని కంటైనర్ లోపలికి వెళ్లిన వెంకీ ఓ గన్ పట్టుకుని బయటకు వచ్చారు. భారీ తుపాకీని పట్టుకుని ముందు పడిపోయిన ఉన్న విలన్లలో `నేనిక్కడే ఉంటాన్ రా.. ఎక్కడికి వెళ్లను.. రమ్మను` అంటూ వెంకీ వార్నింగ్ అదిరిపోయేలా ఉంది. ఆయన లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉండటం విశేషం. కొద్దిగా గెడ్డంతో, ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు వెంకటేష్. `సైంధవ్` ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఇది వెంకటేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేష్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు వెల్లడించారు. వెంకటేష్ చివరగా `దృశ్యం2`, `వెంకీమామ`, `ఎఫ్3` వంటి ఫ్యామిలీ, కామెడీ చిత్రాల్లో నటించారు. చాలా రోజుల తర్వాత ఆయన యాక్షన్ సినిమా చేయబోతుండటం విశేషం.
ఇక `హిట్` ఫ్రాంఛైజీతో జోరుమీదున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇటీవల ఆయన `హిట్2`తో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే `హిట్3`ని కూడా నానితో ప్రకటించారు. మరి అది పక్కన పెట్టి వెంకటేష్తో `సైంధవ్` సినిమా చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇది వెంకటేష్కి 75వ చిత్రం కావడం విశేషం.