దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో వెంకటేష్‌ బాబాయ్‌ కన్నుమూశారు. దీంతో అటు టాలీవుడ్‌లో, ఇటు వెంకీ ఫ్యామిలీ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

హీరో దగ్గుబాటి వెంకటేష్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వెంకటేష్‌ బాబాయ్‌, దివంగత నిర్మాత రామానాయుడు సోదరుడు మోహన్‌బాబు(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామమోహన్‌రావు అలియాస్‌ మోహన్‌బాబు తన స్వగ్రామం బాపట్ల జిల్లా కారంచేడులోని తమ నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో దగ్గుబాటి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిర్మాత సురేష్‌బాబు ఫ్యామిలీ విషయం తెలుసుకుని హుటాహుటిన కారంచేడుకి చేరుకుని బాబాయ్‌ మోహన్‌బాబు భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. వెంకటేష్‌ ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. అక్కడ తన సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడని సమాచారం. దీంతో ఆయన వెళ్లలేకపోయారని, నేడు(బుధవారం) కారంచేడుకి వెళ్లి బాబాయ్‌కి నివాళ్లు అర్పించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే మోహన్‌బాబు నిర్మాత కూడా. ఆయన `ఒక చల్లని రాత్రి` అనే సినిమాని నిర్మించారు. దీంతోపాటు మరో రెండు సినిమాలను అన్న భాగస్వామ్యంలో నిర్మించినట్టు సమాచారం. దీంతోపాటు చీరాలలోని ఓ థియేటర్‌లో ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. 

దివంగత రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా రాణించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు. ఏకంగా గిన్నిస్‌ రికార్డు ని సాధించారు. ఆయన వారసత్వాన్ని పెద్ద కుమారుడు సురేష్‌బాబు కొనసాగిస్తున్నారు. నిర్మాతగా కొనసాగిస్తున్నారు. మరోవైపు చిన్న కుమారుడు వెంకటేష్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సురేష్‌ బాబు ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు రానా హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. అలాగే చిన్న కుమారుడు అభిరామ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక ఇప్పుడు చనిపోయిన మోహన్‌బాబు ఫ్యామిలీ డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.