`గబ్బర్‌ సింగ్‌` తర్వాత పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మరో మూవీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`. ఈ సినిమా షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగుతుంది. పవన్‌ స్పీడ్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేస్తుంది.

ఒకప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తవుతుందో అనే కామెంట్లు వినిపించేవి. కానీ ఇప్పుడు అంతా రివర్స్. నెల రోజుల్లో సినిమాని కంప్లీట్‌ చేస్తూ అత్యంత ఫాస్ట్ గా సినిమాలు చేసే హీరోగా నిలిచారు. ప్రస్తుతం ఆయన్ని మించిన వేగం మరే హీరోకి సాధ్యం కాదనేలా ఆయన సినిమాల షూటింగ్‌లు జరుగుతుండటం విశేషం. ఇప్పటికే `వినోదయ సీతం` రీమేక్‌ని కంప్లీట్‌ చేశారు పవన్‌. ఇరవై రోజుల్లోనే దాన్ని కంప్లీట్‌ చేశాడు. ఇప్పుడు మరో రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. అందులో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ` చిత్రాలున్నాయి.

తాజాగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల ఐదున ప్రారంభమైంది. తాజాగా మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిస్తూ మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసినట్టు తెలిపారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు, వినోదాత్మక సన్నివేశాలు చిత్రీకరించారట. 

`ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించాం. వీటితోపాటు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు షూట్‌ చేశాం. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. నాయిక శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు` అని యూనిట్‌ వెల్లడించింది.

మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉందట. బ్లాక్ బస్టర్ `గబ్బర్ సింగ్` కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ` అని అంటున్నారు మేకర్స్.

`ఉస్తాద్ భగత్ సింగ్` నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. 

`గబ్బర్ సింగ్` కోసం మెమరబుల్ ఆల్బమ్‌ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని యూనిట్‌ వెల్లడించింది. ఇంతటి స్పీడ్‌లో పవన్‌ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీలీలా కథానాయికగా నటిస్తుంది. పూజా హెగ్డే మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ అని అనుకున్నారు. కానీ ఆమె పాత్ర ఉంటుందా? లేదా అనేది సందిగ్దంగా మారింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. చెర్రీ సీఈవో. పీఆర్‌ఓః వేణుగోపాల్‌.