కరోనాకు మరొకరు బలి: సినీ ఫోటోగ్రాఫర్ కన్నుమూత
నిన్న(గురువారం) రాత్రి ప్రముఖ గాయకుడు జి.ఆనంద్ తుదిశ్వాస విడిచారు. అదే టైమ్లో ప్రముఖ సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన తుదిశ్వాస విడిచారు.
కరోనాతో అనేక మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఏకంగా లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంని బలితీసుకుంది కరోనా. ఇటీవల ఇద్దరు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ మృతి చెందారు. నిన్న(గురువారం) రాత్రి ప్రముఖ గాయకుడు జి.ఆనంద్ తుదిశ్వాస విడిచారు. అదే టైమ్లో ప్రముఖ సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. బ్యాక్ టూ బ్యాక్ ప్రముఖుల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తుంది.
మోహన్.జి పూర్తి పేరు మాది రెడ్డి కృష్ణమోహన్ రావు. 1935లో గుంటూరులో పుట్టారు. వాళ్ల నాన్న కృష్ణారావు విజయవాడలో శ్రీకాంత్ పిక్చర్స్ పంపిణీ సంస్థ లో మేనేజర్ గా పనిచేసేవారు. తర్వాత వీళ్ళ కుటుంబం చెన్నై కి షిఫ్ట్ అయింది. తమ్ముడు జగన్ మోహన్ రావుతో కలసి `మోహన్ జీ జగన్ జీ` పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ప్రారంభించారు. ఎన్టీఆర్ నటించిన `కాడేద్దులు ఎకరం నేల` వీరి తొలి చిత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 900లకు పైగా చిత్రాలకు ఈ సోదరులు పని చేశారు.
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుతో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. ఆయన తొలి సినిమా `తాత మనవడు` నుండి `ఒరేయ్ రిక్షా` వరకూ వంద సినిమాలకు పని చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు, మురళీ మోహన్ చిత్రాలకే కాకుండా కన్నడంలో రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, తమిళంలో జెమినీ గణేషన్, రజనీకాంత్ చిత్రాలకు కూడా పని చేశారు. ఈ సోదరులలో చిన్నవాడైన జగన్ మోహన్ కొంత కాలం క్రితం కన్ను మూశారు.