మెగా హీరోలందరిలా తనదీ అదే ఫార్ములా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా నిర్ణయం అందరు మెగా హీరోల్లా పవన్ కళ్యాణ్ కూడా ఆ వేడుకకు దూరం
మెగా హీరోలంతా.. ఈ మధ్య కాలంలో తమ సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆడియో వేడుకలు జరుపుకోకుండానే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ సరైనోడు సినిమా నుంచి మెగా హీరోలు నటించిన ఏ సినిమాకు ఇటీవల ఆడియో వేడుకను నిర్వహించలేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150లతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ జరపలేదు. ఇటీవల ఆడియో వేడుకలను దూరం పెడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే నిర్వహిస్తున్నారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. మెగా హీరోలందరిలానే పవన్ కూడా తన తాజా చిత్రం కాటమరాయుడుకు ఆడియో వేడుక నిర్వహించొద్దని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
గోపాల గోపాల ఫేం డాలీ( కిశోర్ పార్థసాని) దర్శకత్వం వహిస్తున్న కాటమరాయుడు చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్‑టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
