Rip Krishnam Raju : కృష్ణం రాజు మృతికి చిరంజీవి, మహేశ్ బాబు, బాలయ్య, ఎన్టీఆర్, అనుష్క శెట్టిసంతాపం..
టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలుసుకుంటున్న స్టార్స్ దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తాజాగా చిరంజీవి, అనుష్క శెట్టితో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ తెలుగు నటుడు ఉప్పలపాటి కృష్ణం రాజు (83) (Krishnam Raju) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో నిన్న ఆస్ప్రతిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు కూడా తనవంతు కృషి చేశారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడంతో టాలీవుడ్ స్టార్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికన నివాళి అర్పిస్తున్నారు.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కృష్ణం రాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేరనే చేధు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ట్వీట్టర్ లో భావోద్వేగ ప్రకటన చేశారు. ‘కృష్ణం రాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణం రాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియజేస్తున్నాన’ని అన్నారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా కృష్ణం రాజు మరణవార్త తెలుసుకొని చింతించారు. లెజెండరీ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మంచితనానికి మారుపేరైన కృష్ణం రాజు సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయనతో కలిసి రెండు చిత్రాల్లో నటించడం ఎప్పటి మరిచిపోలేను. అది గొప్ప అనుభవం. మా కుటుంబానికి ఆయనకు అనుబంధం ఉంది. అపోలో ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కలిశాం. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునే వాడిని. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. కృష్ణం రాజు పవిత్ర ఆత్మకు శాంతివ చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా కృష్ణం రాజు ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ట్వీటర్ లో సంతాపం వ్యక్తం చేశారు. ‘కృష్ణంరాజు గారు ఇక లేరని తెలిసి షాక్ అయ్యాను... నాకు మరియు మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు ఇది. ఆయన జీవితం, ఆయన చేసిన కృషి, సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రభాస్కి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు మరణవార్త తెలుసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR) కూడా తాజాగా సంతాపం వ్యక్తం చేశారు. ట్వీటర్ లో ఎమోషనల్ నోట్ రాశారు. ‘కృష్ణంరాజు గారు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా కృష్ణం రాజు లేరని తెలియగానే దిగ్బ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా కృష్ణం రాజుతో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంటూ సంతాపం వ్యక్తం చేసింది. ‘మన కృష్ణంరాజు గారు స్వర్గంలో ప్రశాంతంగా ఉండాలి. అతిపెద్ద హృదయం మహామనిషిగా, మీరు మా హృదయాలలో ఎప్పుడూ జీవించి ఉంటారు.’ అని పేర్కొంది.