`బలగం` సక్సెస్‌ సందర్భంగా దర్శకుడు వేణు యెల్దండి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని, స్ట్రగుల్స్ ని, వివాదాన్ని పంచుకున్నారు.

`బలగం`.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు పది కోట్లు వసూలు చేసింది.ఇంకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. తెలంగాణ పల్లెల్లో `చావు` చుట్టు అల్లుకున్న కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల ప్రధానంగా సాగే ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ఈ సినిమాలో తమ జీవితాలను చూసుకుంటున్నారు. అందుకే సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. 

`బలగం` సక్సెస్‌ సందర్భంగా దర్శకుడు వేణు యెల్దండి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని, స్ట్రగుల్స్ ని, వివాదాన్ని పంచుకున్నారు. సినిమా విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, అంతకు ముందు ఒరేయ్‌ అని పిలిచే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు గౌరవిస్తున్నారని, ఆ గౌరవం చూస్తుంటే భయంగానూ ఉందని, ఇది తనపై బాధ్యతని పెంచిందన్నారు. చిరంజీవిగారు పిలిచి నన్ను సత్కరించడం చాలా సంతోషాన్నిచ్చిందని, అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. సినిమా విజయంతో జనం నన్ను చూసే కోణం మారిందన్నారు. గర్వంగా ఉందని ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని, ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదన్నారు. 

అయితే కమెడియన్‌గా బ్రేక్‌ లేని బాధ నుంచి, ఆ కసి నుంచి దర్శకుడు అవ్వాలనే కోరిక పుట్టిందని, తనని తాను నిరూపించుకోవాలనే ఆ కసి నుంచి `బలగం` సినిమా వచ్చిందన్నారు. దీనికంటే ముందు రెండు మూడు కథలు అనుకున్నానని, కానీ అవి రెగ్యూలర్‌గా ఉండటం, ఇది కొత్తగా ఉండటం, ఇలాంటి ఎమోషన్స్ తో సినిమా రాలేదు, కచ్చితంగా కొత్తగా ఉంటుందనే భావనతో, ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. కరోనా కారణంగా ఓటీటీల జోరు పెరగడంతో అవి తనకు ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. అయితే తమది పెద్ద కుటుంబం అని, చిన్నప్పట్నుంచి తాను చూసిన సంఘటనల నుంచి ఈ కథ పుట్టిందన్నారు. అయితే రిఫరెన్స్ కోసం కొన్ని పదుల సినిమాలు చేశానని, ముఖ్యంగా మరాఠీ చిత్రాలను బాగా చూశానని, వాటి స్ఫూర్తితో రాసుకున్న కథ ఇదన్నారు. 

అయితే ఇలాంటి కథలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయని, ఒక్కొక్కరు చూసే కోణం వేరని, తాను ఇలా చూశాననని, అంతేకాదు ఎవరో రాసుకున్న కథకి కాపీ కాదన్నారు. తనకు అలాంటి అవసరం లేదని, నిజ జీవితంలో తన ఫ్యామిలీలో జరిగిన సంఘటనే ఈ చిత్రానికి స్ఫూర్తి అని తెలిపారు దర్శకుడు వేణు యెల్దండి. వివాదం గురించి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ అబ్బాయిని ఎవరో మిస్‌ గౌడ్‌ చేశారని, ఏదో ఆశించిన ఇలా చేశారని, ఆయన్ని చూస్తుంటే జాలేస్తుందన్నారు. తప్పు తెలుసుకునే అతనే సైలెంట్‌ అయ్యాడని వెల్లడించారు. 

ఇక తాను దర్శకుడిగా మారుతానంటే చాలా మంది ఎగతాళి చేశారని, ఎందుకురా నీకు, కామెడీ చేసుకోగా అని, తనని ఎవరూ నమ్మలేదని, కానీ తనని తాను నమ్మానని, ఆ నమ్మకంతోనే ముందుకు సాగానని చెప్పారు. దర్శకుడిగా మారే క్రమంలో అనేక స్ట్రగుల్స్ పడ్డానని చెప్పారు. అనేక డిజప్పాయింట్‌మెంట్లు తనకు ఎదురైనట్టు పేర్కొన్నారు. ఇప్పుడే కాదు, చిన్నప్పట్నుంచి అలాంటి కామెంట్లు వింటూనే ఉన్నానని చెప్పారు వేణు. మా కుటుంబంలో పదో తరగతి వరకు చదివింది ఎవరూ లేదు. అప్పుడు తానే మొదటిసారి టెన్త్ చదివానని, ఆ టైమ్‌లోనే చాలా మంది తనని ఎగతాళి చేశారని చేశారని చెప్పుకొచ్చారు. 

తనని నమ్మి సినిమా తీసిన దిల్‌రాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కథని మొదట ఫ్రెండ్‌కి చెప్పగా, ఆయన డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారని, ఆయన దిల్‌రాజు వద్దకి తీసుకెళ్లారని, అలా ఈ సినిమా పట్టాలెక్కిందన్నారు. మొదట ఈ కథలో హీరోగా తానే నటించాలనుకున్నానని, కానీఫ్రెండ్స్ సూచనతో ప్రియదర్శిని తీసుకున్నానని చెప్పారు. దిల్‌రాజుకే మరో కథ చెప్పానని, అది పూర్తి భిన్నంగా ఉటుందని, ఇకపై కూడా దర్శకుడిగా విభిన్న కథలను చేయాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే కమెడియన్‌గానూ కొనసాగుతానని వెల్లడించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు.