ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం..
ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు.
మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీనికి చిరంజీవిని ఆహ్వానించడం విశేషం.
అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు. దీనికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు. పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
అల్లూరి సీతారామరాజు ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్నాటకలకు బాగా తెలుసు. అక్కడ ఆయన ఉద్యమాలను నిర్వహించారు. ఇక్కడి ప్రజలంతా అల్లూరినీ `మన్యం వీరుడి`గా పిలుచుకుంటారు. `అజాదీ కా అమృత్ మహోత్సవం`లో భాగంగా దేశం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించబోతున్నట్టు తెలిపారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అల్లూరి 125వ జయంతి సందర్బంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని సక్సెస్ చేయాలని చిరంజీవిని మంత్రి కిషన్ రెడ్డి కోరారు.