నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayan) ఈ  ఉదయం తుదిశ్వాస విడిచారు. మూడు తరాల ప్రేక్షకులను అలరించిన ఆయన అంత్యక్రియలపై తాజాగా అప్డేట్ అందింది. 

తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. 60 ఏండ్లుగా మూడు తరాల తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ స్టార్స్, సినీ పెద్దలు, అభిమానులు, రాజకీయ నాయకులు చింతిస్తున్నారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా ఫిల్మ్ నగర్ లోని కైకాల ఇంటికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సంతాపం ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక కైకాల అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం పార్థివ దేహాన్ని ఈరోజు మొత్తం ఇంటివద్దే ఉంచారు. రేపటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, నవరస నటసార్వభౌముడి అంత్యక్రియలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలిచ్చారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియులు జరుగనున్నాయి. 

ఈ ఏడాది టాలీవుడ్ సీనియర్ నటులు క్రిష్ణం రాజు, క్రిష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో సీనియర్ నటుడు కైకాలా కన్నుమూయడం మరింతగా బాధిస్తోంది. దాదాపు 770 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. అన్ని తరహా పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. అరవై ఏండ్లుగా అలరిస్తూనే వచ్చారు. కైకాల చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహార్షి’లో ఓ ముఖ్య పాత్రను పోషించారు.