#LEO ఆ తెలుగు చిత్రం కాపీనా? స్టోరీ లైన్ తీసుకుని చేసారా?
“లియో” అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు లోకేష్ తీసిన “విక్రమ్” తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పింది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ లియో(Leo) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.ప్లాఫ్ అంటూ ఎరగని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కించటమే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అలాగే కమల్ హాసన్తో 'విక్రమ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం వల్ల సినిమా భారీ రేంజ్లో హైప్ ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం రెండొందల కోట్ల పై చిలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది. అదేమిటంటే..
ఈ చిత్రం హాలీవుడ్ ఫ్రీమేక్ అని, అది ఆల్రెడీ తెలుగులో యాజటీజ్ వచ్చిందని, దాన్నించి తీసుకుని సినిమా చేసారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' ఆధారంగా దీన్ని దర్శకుడు లోకేశ్ తెరకెక్కించారని చెప్పుకుంటున్నారు. డేవిడ్ క్రోనెన్ బర్గ్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ ఇంగ్లీష్ మూవీ.. కల్ట్ క్లాసిక్ గ్యాంగ్స్టర్ సినిమాగా నిలిచింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ తీశారు. 2010లో గాయం 2 పేరుతో రిలీజైన ఈ చిత్రం ఫరవాలేదనిపించుకుంది. ఇప్పుడు అదే 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' సినిమాలోని ఓ కోర్ పాయింట్ను తీసుకుని దర్శకుడు లోకేశ్ తనదైన స్టైల్లో మార్చి స్క్రిప్టు రాసుకుని డైరెక్ట్ చేశారట. ఎలాగో లోకేశ్ టాలెంట్ ఎలాంటిదో ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో చూశాం. కాబట్టి లియోను కాపీలా కాకుండా అద్భుతంగా తెరకెక్కించే ఉంటారని అభిమానులు ఆశపడుతున్నారు.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.