డిప్యూటీ సీఎం పవన్ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు.. ఏం మాట్లాడారంటే?
ఏపీ డిప్యూటీ సీఎంగా హీరో పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తెలుగు సినీ నిర్మాతలు పవన్ని కలిసి అభినందనలు తెలియజేశారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది రోజులు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ని నిర్మాతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. `కల్కి2898ఏడీ` నిర్మాత సి అశ్వినీదత్ పవన్కి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియచేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, సురేష్బాబు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ(చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీ కృష్ణ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్తో సరదాగా ముచ్చటించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సినిమా విడుదలకు సంబంధించిన పరిస్థితులు, ఏపీలో సినిమా షూటింగ్లకు సంబంధించిన వాతావరణం, ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితి ఇలా చాలా విషయాలను వారు సరదాగా ముచ్చటించారు.
గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలు కూడా నిర్మాతలు పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి, పవన్కి సన్మాన చేయాలనే తమ ఆలోచనను వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలియచేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారన్నారు. ఈ రోజు మా అందరికి చాలా సంతోషకరమైన రోజు అని అల్లు అరవింద్ వెల్లడించడం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు అల్లు అరవింద్.