Asianet News TeluguAsianet News Telugu

`దిశః ఎన్‌కౌంటర్‌` సినిమా కేసులో వర్మకి మరోసారి హైకోర్ట్ నోటీసులు

దిశ సినిమా కేసులో హైకోర్ట్ మరోసారి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి సోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రామ్‌గోపాల్‌ వర్మ గతేడాది జరిగిన `దిశ` ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా `దిశ ఎన్ కౌంటర్` చిత్రాన్ని నిలిపివేయాలని దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. 

telangana highcourt issue show cause notice to ram gopal varma arj
Author
Hyderabad, First Published Nov 24, 2020, 3:22 PM IST

దిశ సినిమా కేసులో హైకోర్ట్ మరోసారి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి సోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రామ్‌గోపాల్‌ వర్మ గతేడాది జరిగిన `దిశ` ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా `దిశ ఎన్ కౌంటర్` చిత్రాన్ని నిలిపివేయాలని దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు.

ఇప్పుడు ఈ సినిమా తీసి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మను వివరణ కోరిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఈ సినిమాను ఆపాలంటూ అటు దిశ కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఆపాలంటూ `దిశ` తండ్రి హైకోర్ట్ ని ఆశ్రయించాడు. 

దిశ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ని గతవారమే విచారించిన హైకోర్ట్ దీనిపై వివరణ ఇవ్వాలని రామ్‌గోపాల్‌ వర్మకి నోటీసులు ఇచ్చింది. అంతేకాదు సెన్సార్‌ బోర్డ్ నిర్ణయం తీసుకోక ముందే కోర్ట్ ని ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. ట్రైలర్‌ ని విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని తెలిపింది. 

సినిమా తీసేందుకు అనుమతులున్నాయో, లేదో తెలుసుకుని చెప్పాలంటూ అసిస్టెంట్‌ సిలిసిటర్‌ జనరల్‌ని కోర్ట్ ఆదేశించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్‌ బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి హైకోర్ట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే గతేడాది నవంబర్‌ 26న షాద్‌ నగర్‌లో దిశపై నలుగురు కుర్రాళ్లు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటన ఆధారంగా వర్మ `దిశః ఎన్‌కౌంటర్‌` పేరుతో సినిమాని రూపొందించారు. దీన్ని ఈ నెల 26న విడుదల చేయాలని వర్మ భావించారు. ఇప్పుడు విడుదలపై  సస్పెన్స్ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios