థ్రోట్‌ క్యాన్సర్‌తో పోరాడిన గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పురి కాలనీ సొసైటీ. 

గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(Kandikonda Yadagiri) కన్నుమూసిన విషయం తెలిసిందే. శనివారం ఆయన వెంగళ్రావు నగర్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి కేటీఆర్‌, ఇతర సినీ ప్రముఖులు స్పందించి సహాయం అందించారు. ఇన్నాళ్లు థ్రోట్‌ క్యాన్సర్‌తో పోరాడిన ఆయన చివరికి ఓడిపోయారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పురి కాలనీ సొసైటీ. 

వారి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ వల్లభనేని. రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల సంతాపం తెలిపిన ఆయన తనకు విషయం తెలిసి చాలా బాధ పడుతున్నానని చెప్పారు. ముందు కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని, అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 

అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేయడం జరిగిందన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. 

 మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని, వారి కుమార్తె సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ఇతర సహాయం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. అయితే కొందరు కావాలని ఈ విషయం మీద దుష్ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలా చేయడం సరికాదని అన్నారు. కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇవ్వడానికి ఏ సమయంలో అయినా సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా అనిల్ వెల్లడించారు.