రానాతో చేయబోయే చిత్రం టైటిల్ రివీల్ చేసిన తేజ
ఈ మూవీలో రానా కోసం తేజ పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడని టాలీవుడ్ బజ్. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ సైతం ఇంట్రస్టింగ్ గా ఉంది.
దగ్గుబాటి హీరో రానా హీరోగా 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటించగా.. కేథరిన్ థ్రెసా మరో హీరోయిన్ గా బలమైన పాత్రలో నటించింది. బాహుబలి 2 లో విలనిజం చూపించిన రానా.. ఆ తరువాత ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి నెగటివ్ షేడ్స్ తో కూడా హీరోయిజం చూపించవచ్చు అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా చివరిలో హీరో ,హీరోయిన్ పాత్రలను చంపేసి నెగటివ్ ఎండింగ్ ఇచ్చిన కూడా అభిమానులకు ఈ మూవీ బాగా నచ్చేసింది.
ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో రెండో సినిమాని ఇప్పుడు స్టార్ట్ చేశారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధం కానున్న ఈ చిత్రానికి గోపీనాథ్ ఆచంట నిర్మాతగా వ్యవహరించనున్నారు. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్హీరో ఇందులో కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే, ఈ సినిమాలో రానా పాత్ర మరింత పవర్ఫుల్గా ఉండనుంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని చిత్రటీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ ని కూడా తేజ రివీల్ చేసారు.
రానా తో త్వరలో తాను చేయనున్న మూవీకి రాక్షస రాజు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో 45 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు దీని కోసం ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించవచ్చని తేజ వెల్లడించారు.
ఇక రానా సోదరుడు అభిరామ్ హీరోగా తేజ ఇటీవల ‘అహింస’ చిత్రాన్ని తెరకెక్కించారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రానా ఇటీవల ‘రానా నాయుడు’ సిరీస్తో ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే ఈ సిరీస్కు సీక్వెల్గా ‘రానా నాయుడు -2’ రూపుదిద్దుకోనుంది. ‘అహింస’ సినిమా రిలీజ్ అయ్యాక రానా - తేజ కాంబోలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.