నంది అవార్డులపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. అంతేకాదు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో యూనిటీ లేదని, అందరి ఒక్క మాటమీద ఉండాలని, ఇండస్ట్రీ బాగుకోసం పాటు పాడాలని, ముఖ్యంగా ఇండస్ట్రీలో కుల తత్వం పోవాలి అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మరోవైపు నంది అవార్డులపై నటుడు, ఏపీ ఎఫ్డీసీ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో దీనిపై తమ్మారెడ్డి స్పందించారు. తాజాగా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న తమ్మారెడ్డి దీనిపై రియాక్ట్ అయ్యారు.
అసలు అవార్డులే లేనప్పుడు ఇక దానిపై చర్చ ఎందుకు అని చెప్పారు. పోసానికి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో ఆయనకు తెలుసని, దానిపై తాను కామెంట్ చేయనన్నారు. అయితే అవార్డులే ఇవ్వనప్పుడు ఇకప దానిపై డిస్కషన్ ఎందుకని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇంకా ఆయన చెబుతూ, ఒకప్పుడు అవార్డులు సరిగ్గా ఇవ్వలేదు... ప్రస్తుత ఆంధ్రా ప్రభుత్వం అవార్డులు ఇస్తే సక్రమంగా ఇచ్చేలా చూస్తాం అన్నట్లు నాకు అనిపించింది. అసలు ఈ అవార్డు వ్యవస్థపై ఏ ప్రభుత్వానికి అంత ఆసక్తి లేదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కాకతీయ అవార్డులు, సింహా అవార్డులు అని చెప్పింది. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. ఇస్తే వివాదాలు వస్తాయని సైలెంట్గా ఉంటున్నారేమో అని చెప్పారు. `ఓ వ్యక్తి కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఇలాగే అవార్డుల ప్రస్తావన తీసుకొస్తే.. ఎందుకయ్యా ఇదంతా.. అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఆ లొల్లిని కదపడం అవసరమా? అన్నారట`. ఇది ఎవరో చెప్పగా విన్నాను. ఆయన చెప్పిందీ నిజమే కదా! అసలు లేని అవార్డుల గురించి చర్చ ఎందుకు? శక్తి ఉంటే ప్రభుత్వాలను ఒప్పించి అవార్డులు ఇప్పించగలగాలి. లేదంటే సైలెంట్గా ఊరుకోవాలి. ఈ చర్చలు, సమావేశాల వల్ల సమయం వృథా తప్ప కలిసొచ్చేది ఏమీ లేదు. అవార్డులు ఇస్తే కులాలకు ఇచ్చారు, నచ్చిన వాళ్లకు ఇచ్చారు అంటారు. ఇవ్వకపోతే ఇవ్వలేదంటారని తమ్మారెడ్డి తెలిపారు.
చిత్ర పరిశ్రమలో అనైక్యత గురించి ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్లో ఐక్యత లేదన్నారు. పరిశ్రమలో అందరూ కలిసి కట్టుగా ఉండడం నేర్చుకోవాలని ఆయన తెలిపారు. చేసే పనిలో పోటీ ఉండాలి తప్ప... ఈర్ష్య, ద్వేషాల్లో పోటీ ఉండకూడదని వెల్లడించారు. ఇప్పుడు ఇండస్ట్రీతో ఆరోగ్యకరమైన పోటీ కన్నా ఇలాంటివే ఎక్కువ అయ్యాయి. కులతత్వం, గ్రూపిజం ఇవ్వన్నీ పోతేనే పరిశ్రమ బాగుపడుతుంది. వందల కోట్లు పెట్టి తీసిన చిత్రాలే ఆడతాయనే పిచ్చి భ్రమ నుంచి బయటకు రావాలి. `బలగం` లాంటి చిన్న సినిమాలు కూడా సంచలనం సృష్టిస్తాయని తెలుసుకోవాలని, ఆ దిశగా ముందుకు సాగాలన్నారు తమ్మారెడ్డి.
కీరవాణి, చంద్రబోస్లకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో వారిని సత్కరించే విషయంలో జాప్యంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ, నామినేషన్కి వెళ్లిన రోజే పరిశ్రమ తరఫున `ఆర్ఆర్ఆర్` బృందాన్ని పెద్ద వేదికగా అభినందించాలనుకున్నాం. అప్పట్నుంచి వారితో మాట్లాడుతున్నాం. కానీ అవార్డులు వచ్చాక చూసుకుందామన్నారు. అవార్డు వచ్చాక కూడా వారి డేట్స్ కోసం చూస్తున్నామని, వాళ్లు బిజీ కారణంగా లేట్ అయ్యిందని, ఫైనల్గా ఇప్పుడు సెట్ అయ్యిందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ తరఫునే వారిని సత్కరించబోతున్నామని వెల్లడించారు తమ్మారెడ్డి.
శుక్రవారం మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ,`టెంపర్` సినిమాలో నటనకు గాను తనకు నంది అవార్డ్ వచ్చిందని, కానీ అది తన దృష్టిలో కమ్మ నంది అని, అందుకే తిరస్కరించానని పోసాని పేర్కొన్నారు. అవి నంది అవార్డులు కాదని, కమ్మ నందులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమలో కమ్మ, కాపు డామినేషన్ లేదని.. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే డామినేషన్ చేస్తుందని ఆయన అన్నారు. పోసాని వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో తాజాగా తమ్మారెడ్డి పై విధంగా స్పందించారు.
