ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ రీల్‌ లైఫ్‌ ధోనీగా కనిపించి, నిజమైన ధోనిని మరిపించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ధోనీ రిటైర్‌మెంట్‌పై సుశాంత్‌ స్పందించారు. పలు ఆసక్తికర కామెంట్‌ చేశారు. 

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ని ప్రపంచ క్రికెట్‌లో అగ్ర స్థానంలో నిలిపి అనేక విజయాలను అందించిన కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీ. టీమ్‌ ఇండియాకి ఓ వైభవాన్ని తీసుకొచ్చిన కెప్టెన్‌ కూడా ధోనినే. వ్యూహాత్మక జట్టు నాయకుడిగా, మిస్టర్‌ కూల్‌గా, అత్యధిక ఔట్లు చేసిన వికెట్‌ కీపర్‌, హెలికాప్టర్‌షాట్లతో బ్యాట్‌ ఝులిపించిన బ్యాట్స్ మెన్‌గా ఆయన ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా నిలిచిపోతారు. ధోనీ అంటే ఓ శకంగా కీర్తింపబడ్డ ధోని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం తన అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 

రాంచీకి చెందిన ధోనీ ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి ఇండియన్‌ టీమ్‌కి కెప్టెన్‌ కావడంతోపాటు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నిజంగానే ఆయన జీవితం స్ఫూర్తివంతమైనది. ఆయనపై తీసిన `ఎమ్‌.ఎస్‌ ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ` దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ రీల్‌ లైఫ్‌ ధోనీగా కనిపించి, నిజమైన ధోనిని మరిపించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ధోనీ రిటైర్‌మెంట్‌పై సుశాంత్‌ స్పందించారు. పలు ఆసక్తికర కామెంట్‌ చేశారు. 

సుశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధోనీ సరైన టైమ్‌లో తన రిటైర్‌ మెంట్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఆయన చాలా కాలంగా ఇండియా క్రికెట్‌ టీమ్‌కి సేవలందిస్తున్నారు. ఆయన సేవ చాలా గొప్పది. అందుకే రిటైర్‌మెంట్‌ గురించి నిర్ణయించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉందని నేను నమ్ముతున్నా` అని తెలిపారు. తాజాగా ధోని తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించడంతో ఇప్పుడు సుశాంత్‌ మాటలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇక నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు త్వరలో సీబీఐ కూడా రంగంలోకి దిగబోతుంది. రోజుకో కొత్త వార్త బయటకు వస్తూ సుశాంత్‌ కేసు ఉత్కంఠభరితంగా సాగుతుంది.