సుశాంత్ ఆ సినిమా చేయాల్సి ఉంది.. డబ్బు కూడా తీసుకున్నాడు!
ఇటీవల మరణించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరగా చిచోరే సినిమాలో కనిపించిన సంగతి తెలిసింది. ఈ సినిమా నిర్మాత అయిన సాజిద్ నదియావాల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సుశాంత్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఒకసారిగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ ఆర్దిక సమస్యల కారణంగానే ఆయన మరణించినట్టుగా వార్తలు వినిపించినా తాజాగా అవన్ని నిజం కాదని తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్లో నటించేందుకు సుశాంత్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ అన్ని లాక్ డౌన్ పూర్తయిన వెంటనే పట్టాలెక్కించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
సుశాంత్ చివరగా నటించిన సినిమా చిచోరే. ఈ సినిమా సుశాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా పేరు తెచ్చుకోవటమే కాదు 2019లో అత్యధిక మంది ఆధరించిన సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా నిర్మాత సాజిద్ నదివాలాతో సుశాంత్ మరో సినిమా చేసేందుకు సైన్ చేశాడు. అంతేకాదు ఆ సినిమా కోసం ఇప్పటికే పేమెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అవకాశాలు లేక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలను ఖండించిన ప్రముఖ జర్నలిస్ట్ కవేరీ బామ్జాయ్ తన ట్విటర్ పేజ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `సుశాంత్ సింగ్ రాజ్పుత్కు అవకాశాలు లేవనటం కరెక్ట్ కాదు. చిచోరే తరువాత సాజిద్ నిర్మాణంలోనే మరో సినిమాకు సైన్ చేశాడు సుశాంత్. అందుకు పారితోషికం కూడా అందుకున్నాడు. రుమీ జాఫ్రీ కూడా సుశాంత్తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఇండస్ట్రీలో ప్రతిభను తప్పని సరిగా గుర్తిస్తారు` అంటూ ఆమె ట్వీట్ చేశారు.