దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూర్య పాత్రని సృష్టించారు. ఈ పాత్రకి ఇప్పుడు ఓ కథ ఉందట. దాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో యాక్షన్ సినిమాల జోరు సాగుతుంది. యాక్షన్ ప్రధానంగా వచ్చే మూవీస్ రికార్డులు షేక్ చేస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. `పుష్ప`, `ఆర్ఆర్ఆర్`, `కేజీఎఫ్`, `విక్రమ్`, `పఠాన్` సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా రజనీకాంత్ నటించిన `జైలర్` సైతం అదే విషయాన్ని నిరూపించింది. ఇది నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లకి రీచ్ అయ్యింది. దీంతో యాక్షన్ సినిమాలకు క్రేజ్, డిమాండ్ పెరిగింది.
ఇక గతేడాది తమిళంలో వచ్చిన `విక్రమ్` మూవీ సరికొత్త ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. యాక్షన్ సినిమాలకు కొత్త అర్థాన్నిచ్చింది. కంటెంట్, బీజీఎం, స్టార్ కాస్టింగ్ ఈసినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇది నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. ఇందులో సూర్య నటించిన `రోలెక్స్` అనే కోమియో రోల్ హైలైట్గా నిలిచింది. సినిమాకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. అంతేకాదు చివర్లో వచ్చి సినిమా క్రెడిట్ మొత్తాన్ని కొట్టేశాడు సూర్య.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూర్య పాత్రని సృష్టించారు. ఈ పాత్రకి ఇప్పుడు ఓ కథ ఉందట. దాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే `విక్రమ్ 2` కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే అది విక్రమ్తోపాటు రోలెక్స్ పాత్ర ప్రధానంగా ఉంటుందని భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు `రోలెక్స్` పాత్ర ప్రధానంగానే సినిమా చేయబోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని ఏకంగా సూర్య వెల్లడించడం విశేషం. ఇటీవల ఆయన తన అభిమానులతో ముచ్చటించారు. ఇందులో లోకేష్ తనకు `రోలెక్స్` పాత్రతో కూడిన కథని నెరేట్ చేశాడట. అది బాగుందని, త్వరలో ఆ సినిమా పట్టాలెక్కుతుందని వెల్లడించారు. దీంతో సూర్య అభిమానుల్లోనే కాదు, సాధారణ ఆడియెన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది.
`విక్రమ్` సినిమాలో రోలెక్స్ పాత్రకి దక్కిన హైప్, క్రేజ్ మామూలు కాదు. సినిమానది నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్ళింది. అదే రేంజ్లో సినిమా ఉంటే ఇది సంచలనాలకు కేరాఫ్గా నిలవబోతుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సూర్య.. `కంగువా` చిత్రంలో నటిస్తున్నారు. భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. 14వ సెంచరీ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో తన తెగ జనం కోసం పోరాడే యోధుడిగా సూర్య కనిపిస్తున్నారు. ఆయన లుక్ అత్యంత భయంకరంగా ఉంది. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా, దీపికా పదుకొనె గెస్ట్ గా చేయనుందని సమాచారం.
మరోవైపు ఈ సినిమా తర్వాత తన 43వ మూవీని స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్లో దీన్ని ప్రారంభించనున్నారు. అలాగే వెట్రిమారన్తో `వాడివాసల్` పేరుతో సినిమా చేస్తున్నారు సూర్య. ఇది ప్రస్తుతం వెట్రి మారన్ చేస్తున్న `విడుదలై2` తర్వాత ప్రారంభం కానుంది. ఆ తర్వాత `రోలెక్స్` తెరపైకి ఎక్కనుందట. ఆ తర్వాత `ఇరుంబు కై మాయావి` మూవీ చేయబోతున్నారు సూర్య. ఇలా అలాగే తెలుగు దర్శకుడు చందూ మొండేటితోనూ ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. ఇలా నాలుగైదు సినిమాలతో సూర్య మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ `లియో` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎవరితో ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
