రహస్యంగా రజనీకాంత్.. దర్భార్ లో ఏం జరుగుతోంది ?
ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేట చిత్రంతో అలరించాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం రజనీకాంత్ తో దర్బార్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రజని, మురుగదాస్ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు రోజూ వస్తున్నప్పటికీ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసే సినిమాలు తీయడంలో దిట్ట. ఇప్పటికే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ విడుదలయింది.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడనే టాక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఓ పాత్రలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపిస్తుండగా.. రెండో పాత్ర గురించి ఎలాంటి సమాచారం లేదు. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రానికి సంబంధించిన చిన్న విషయం కూడా లీక్ కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు.
అయినా కూడా రజనీకి సంబందించిన కొన్ని స్టిల్స్ లీకైపోయాయి. ప్రస్తుతం దర్బార్ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూణేలో జరుగుతోంది. ఏఈ షెడ్యూల్ పూర్తయ్యాక ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది. పాటలని విదేశాల్లో చిత్రీకరించనున్నారు.
సూపర్ స్టార్ రజనీ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో టీజర్ విడుదలకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దర్బార్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.