మహేష్తో సినిమాపై మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు..
స్టార్ డైరెక్టర్ మణిరత్నం మహేష్బాబుతో సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఓ సినిమా చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలో..
స్టార్ డైరెక్టర్ మణిరత్నం కన్ను ఇప్పుడు టాలీవుడ్పై పడింది. ఇంకా చెప్పాలంటే మహేష్పై పడింది. ఆయన మహేష్బాబుతో సినిమా చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల మణిరత్నం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో తన సినిమాల పవర్ఏంటో చూపించేందుకు `పొన్నియిన్ సెల్వన్` అనే పాన్ ఇండియా చిత్రంతో రాబోతున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. విక్రమ్, కార్తి వంటి బిగ్స్టార్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే కరోనా సమయంలో ఓ వెబ్ సిరీస్ని రూపొందించారు మణిరత్నం. `నవరస` పేరుతో నెట్ఫ్లిక్స్ కోసం ఓ సిరీస్ని నిర్మించారు. తొమ్మిది కథలు, తొమ్మిది ఎమోషన్స్ ప్రధానంగా, తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు ఇలా తొమ్మిది మందితో రూపొందించిన ఈ `నవరస` టీజర్ విడుదలైంది. ప్రధానంగా తారాగణమైన సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, అరవింద స్వామి, సిద్ధార్థ్, రేవతి ఇలా ప్రతి ఒక్కరిలోని నవరసాలకు పలికించేలా టీజర్ సాగింది. బీజీఎం అదరగొట్టింది.
ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ, మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. గతంలో ఓ సారి మహేష్తో సినిమా కోసం చర్చలు జరిపానని, స్టొరీ సరిగ్గా కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదని, సరైన కథ దొరికినప్పుడు తప్పక మహేష్ బాబుతో సినిమా చేస్తానని వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్పై సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది.