విషాదం.. ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కన్నుమూత.. నివాళి అర్పించిన కమల్ హాసన్!
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తమిళ స్టార్ హీరోలతో హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కే మురళీధరన్ (K Muralidharan) తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు, స్టార్స్ నివాళి అర్పిస్తున్నారు.
వరుస విషాద ఘటనలతో సినీ పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే మరణవార్తను మరవక ముందే మరో విషాదం జరిగింది. తమిళ స్టార్స్ కమల్ హాసన్ (Kamal Haasan), విజయ్ తళపతి, సూర్య (Surya)తో పాటు తదితర స్టార్స్ తో చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.మురళీధరన్ నిన్న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మరణ వార్తతో సినీ ప్రముఖులు, స్టార్స్ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా నివాళి తెలుపుతున్నారు.
1994లో శరత్కుమార్ కథానాయకుడిగా విడుదలైన 'ప్యాలెస్ కావలన్' చిత్రంతో కె.మురళీధరన్ నిర్మాతగా పరిచయం అయ్యారు. లక్ష్మీ మూవీ మేకర్స్ ద్వారా మిస్టర్ మద్రాస్, విజయకాంత్ నటించిన ‘ధర్మశక్కారం’, విజయ్ నటించిన ‘ప్రియం’, అజిత్ ‘ఉన్నయ్ తేడీ’, కమల్ హాసన్ నటించిన ‘అన్బే శివం’, ధనుష్ ‘పుదుపట్టే’, సింబు ‘సిలంబట్టం’సహా అనేక చిత్రాలను నిర్మించారు.
ఆయన నిర్మాతగా వ్యవకహరించిన చివరి సినిమాగా 2015లో జయం రవి నటించిన ‘సకలకళావల్లవన్’ విడుదలైంది. ఇక కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మురళీధరన్ తాజాగా గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీటర్ ద్వారా నివాళి అర్పించారు. ‘లక్ష్మీ మూవీ మేకర్స్ అధినేత కె. మురళీధరన్ మరణించడం బాధాకరం. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇంకా గుర్తుకు వస్తున్నాయి. మురళీధరన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానం’టూ తమిళంలో ట్వీట్ చేశారు. అలాగే నటుడు, దర్శకుడు మనోబాలా కూడా నివాళి అర్పించారు.