నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించబోతున్న సోనూ సూద్
నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు సోనూ సూద్. నెల్లూరికి ఆక్సిజన్ ప్లాంట్ చేరుకుందని, త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.
రియల్ హీరో సోనూ సూద్ దేశ వ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన ఆక్సిజన్ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కాలంలో అందిస్తున్న ఆయన సేవా కార్యక్రమాల్లో మరో అడుగు పడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు సోనూ సూద్. నెల్లూరికి ఆక్సిజన్ ప్లాంట్ చేరుకుందని, త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.
`ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకి చేరుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రాణ వాయుడు త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరిన్నిఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయబోతున్నా` అని పేర్కొన్నారు సోనూ సూద్. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. అదే సమయంలో నెల్లూరుకి చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ పరికరాలకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు సోనూసూద్.
సోనూసూద్ గతేడాది కరోనా ప్రారంభం నుంచి వలస కార్మికులకు, పేదలకు తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు. పేదలకు భోజనాలు పెట్టడం, వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం, ఆ తర్వాత పేదలకు ఇల్లు కట్టించడం, ఇతర పని చేసుకునేందుకు కావాల్సిన ట్రాక్టర్లు వంటివి అందించారు. సెకండ్ వేవ్లో ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ నిరంతరాయంగా సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆయన దేవుడయ్యారు. రియల్ హీరో నుంచి సూపర్ హీరో అయ్యారు.