దర్శకుడు వెంకీ అట్లూరి `సార్` మూవీకి వస్తోన్న స్పందన, ఇతర సినిమాలతో పోలికలపై ఆయన స్పందించారు. దీంతోపాటు కులవివక్షతపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. సమానత్వానికి సంబంధించిన ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ధనుష్ హీరోగా నటించిన `సార్` మూవీ శుక్రవారం విడుదలైన నేపథ్యంలో మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓపెనింగ్స్ కూడా ఊహించినదానికంటే బాగా ఉన్నాయని టీమ్ చెబుతుంది. ఈ క్రమంలో శనివారం దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన `సార్` మూవీకి వస్తోన్న స్పందన, ఇతర సినిమాలతో పోలికలపై ఆయన స్పందించారు. దీంతోపాటు కులవివక్షతపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. సమానత్వానికి సంబంధించిన ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
`సార్` మూవీని `త్రీఇడియట్`తో పోల్చడంపై దర్శకుడు వెంకీ అట్లూరి స్పందిస్తూ అది నిజం కాదన్నారు. ఆ సినిమాకి, మా సినిమా ఏ రకంగానూ పోలిక లేదని, రెండూ పూర్తి భిన్నమైనవి అని చెప్పారు. ఇక `సూపర్ 30` కొంత దగ్గరగా ఉంటుందని, కానీ రెండు వేర్వేరు కథలన్నారు. `సూపర్ 30` రియల్ లైఫ్ క్యారెక్టర్తో చేసిందని, కానీ మా సినిమా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, ఎడ్యూకేషన్లో ఉన్న లూప్స్, ఒక లెక్చరర్ స్ట్రగుల్స్ ని చూపించామని, ఇందులో అంతర్లీనంగా చాలా విషయాలను చర్చించామన్నారు. మరోవైపు `సార్` పూర్తి ఫిక్షన్ స్టోరీ అన్నారు. అయితే `సూపర్ 30` వచ్చినప్పుడు తాను కాస్త టెన్షన్ పడ్డాడట. రెండూ ఒకేలా ఉంటాయేమో అని భయపడ్డారట. సినిమా చూశాక ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పారు.
మరోవైపు `సార్` సినిమాలో కులవివక్షత గురించి చర్చించారు దర్శకుడు వెంకీ. దీనిపై ఆయన్ని ప్రశ్నించగా, గ్రామాల్లో కులవివక్ష ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా ఉందన్నారు. అయితే తాను తన కళ్లతో ఇలాంటి వివక్షని చూశానని, కొన్ని కమ్యూనిటీలను తక్కువగా చూడటం తాను ప్రత్యక్షంగా చూశానని, దానికి తాను వ్యతిరేకమన్నారు. అందుకే తన సినిమాల్లో దాని గురించి చర్చించానని తెలిపారు. `తొలి ప్రేమ` సినిమాలోనూ చూపించానని, ఇప్పుడు `సార్` మూవీలోనూ చెప్పానని వెల్లడించారు. అయితే మనవద్ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. 25వేలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంటే ముప్పైవేలు సంపాదించే క్యాబ్ డ్రైవర్ని చిన్న చూపు చూస్తారని తెలిపారు. చేసే పనిలోనే చిన్న చూపు ఉంటుంది. ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తాం, అయినా ఆ వివక్ష ఎందుకుండాలి. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కళ్లు సమానమే అనేది నా ఉద్దేశ్యమని తెలిపారు వెంకీ అట్లూరి.
సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, `ఏ కథైనా చక్కగా చెబితే ఎవరైనా వింటారు. ఇది విద్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మెరుగు పడలేదు. 90ల కథ అయినప్పటికీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోయే కథ. ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఒత్తిడులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. చదువు అనేది నిత్యావసరం. అందుకే ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి మొదట ధనుష్నే అనుకున్నాం. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వల్ల భాషతో సంబంధం లేకుండా ఫహద్ ఫాజిల్, ధనుష్, పృథ్వీరాజ్ వంటి నటులు మనకు మరింత చేరువయ్యారు. ఓటీటీల వల్ల నేను ధనుష్ గారిని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం, ఇంకా ఎక్కువ ఇష్టపడటం చేశాను. ఆయనతో సినిమాతో చేయాలనే కోరిక పెరిగింది. మా నిర్మాతలు ధనుష్ గారికి కథ చెప్తారా అనగానే చాలా సంతోషించాను. కథ చెప్పగానే ఆయన క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అనడంతో ఆనందం కలిగింది.
ఈ సినిమా తల్లిదండ్రులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూశాక నాకు బాగా కావాల్సిన ఆయన ఫోన్ చేసి నేను ఇంకా ఎక్కువ చదువుకుంటే బాగుండు అనిపించింది అన్నారు. అలాగే పిల్లలకు కూడా ఈ సినిమా చూశాక తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ కి అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మనసున్న ప్రతి మనిషికి ఈ సినిమా నచ్చుతుంది. త్రివిక్రమ్ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి మధ్య కథా పరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయో అలాంటి చర్చలు జరిగాయి. ఏదైనా సీన్ నచ్చితే వెంటనే బాగుందని మెచ్చుకునేవాళ్ళు. కొన్ని కొన్ని సీన్లు ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సన్నివేశం ఉంటుంది. అది త్రివిక్రమ్ గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది` అని చెప్పారు.
ఇక వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన `సార్`లో ధనుష్కి జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. సుమంత్, సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రంగా నిర్మించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
