నెపోటిజంపై బాలీవుడ్ నటుడు మండిపాటు.. నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ కేసులో అనేక మలుపులు చోటు చేసుకోవడంతో నెపోటిజం చర్చ కాస్త పక్కకు వెళ్లింది. తాజాగా నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ శేఖర్ సుమన్ తనయుడు, నటుడు, సింగర్ అధ్యయన్ సుమన్ స్పందించారు.
బాలీవుడ్లో నెపోటిజంపై ఇటీవల పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ మాట బాలీవుడ్లో చాలా ఏళ్ళుగా వినిపిస్తూనే ఉంది. కంగనా, రిచా చద్దా వంటి హీరోయిన్లు దీనిపై పలు సందర్భాల్లో గొంతెత్తారు. పలు ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనేక మంది నటీనటులు ముందుకొచ్చి తమకి ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. దీంతో నెపోటిజంపై ఓ ఉద్యమమే ప్రారంభమైంది.
అయితే సుశాంత్ కేసులో అనేక మలుపులు చోటు చేసుకోవడంతో నెపోటిజం చర్చ కాస్త పక్కకు వెళ్లింది. తాజాగా నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ శేఖర్ సుమన్ తనయుడు, నటుడు, సింగర్ అధ్యయన్ సుమన్ స్పందించారు. తాను తొమ్మిదేళ్ళుగా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్టు తెలిపి మరో సంచలనానికి తెరలేపాడు. తన తండ్రి పరిశ్రమలో ప్రముఖంగా రాణిస్తున్నా, తాను నెపోటిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ఓ నిర్మాత తనని తొమ్మిదేళ్ళుగా పట్టించుకోవడం లేదన్నాడు.
ఆయన మాట్లాడుతూ, 2011లో ఓ నిర్మాతను అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో కలిశాను. మీతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నాకు తన ఫోన్ నెంబరు ఇచ్చాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా సమాధానమివ్వలేదు. నేను పంపే మెసేజ్లను చూస్తాడు. కానీ రిప్లై మాత్రం ఇవ్వడు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ నిర్మాతపై సుశాంత్ ఆత్మహత్య కేసులో కొన్ని ఆరోపణలున్నాయి` అని తెలిపి బాలీవుడ్లో నెపోటిజ ఉద్యమానికి మరింత ఊపునిచ్చాడు. నెపోటిజానికి సంబంధించిన చీకటి కోణాలను వెలికి తీసే ప్రయత్నం చేశాడు.
ఇక అధ్యయన్ సుమన్ `హాల్ ఈ దిల్` చిత్రంతో నటుడిగా మారాడు. `రాజ్ - ది మిస్టరీ కంటిన్యూస్', `హార్ట్ లెస్`, `ఇష్క్ క్లిక్`, `లక్నో ఇష్క్` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కెరీర్ పరంగా మొదట్నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో సినిమాలు లేకపోవడం గమనార్హం.