షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన `జవాన్‌` చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర  ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నయన్‌ తో కాస్త జాగ్రత్త అని అంటున్నారు షారూఖ్‌.

షారూఖ్‌ ఖాన్‌.. `పఠాన్‌`తో బంపర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆ ఊపులో ఇప్పుడు `జవాన్‌`గా వస్తున్నారు షారూఖ్‌. ఈ సినిమా ట్రైలర్‌ రెండు రోజుల క్రితం విడుదలై దుమ్ములేపుతుంది. భారీ అంచనాలు పెంచుతుంది. దీనిపై నెటిజన్లు, షారూఖ్‌ ఫ్యాన్స్ తోపాటు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విఘ్నేష్‌ పోస్ట్ కి షారూఖ్‌ ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

నయనతారతో జాగ్రత్తగా ఉండు, ఆమె కొట్టడంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారని ఆయన ట్వీట్‌ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరిగిందంటే.. `జవాన్‌` ట్రైలర్‌ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు విఘ్నేష్‌ శివన్‌. ట్రైలర్‌ బాగా నచ్చిందని, ఇలాంటి బిగ్గెస్ట్ మూవీతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉందని, ట్రైలర్‌ ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఉందన్నారు విఘ్నేష్‌. ఇంకా చెబుతూ షారూఖ్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్‌ కల నెరవేరింది, టీమ్‌కి నా అభినందనలు అని పేర్కొన్నారు విఘ్నేష్‌ శివన్‌. 

దీనికి షారూఖ్‌ ఖాన్‌ స్పందించారు. ఆయన దీన్ని ట్వీట్‌ చేస్తూ ఓ ఆసక్తికర కామెంట్‌ చేశారు. విఘ్నేష్‌ మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నయన్‌ అద్భుతమైన వ్యక్తి. మీకు ఇప్పటికే ఆ విషయం తెలుసు. కానీ ఓ భర్తగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవల ఆమె కొన్ని మేజర్‌ కిక్స్, పంచెస్‌ నేర్చుకున్నారు` అంటూ ట్వీట్‌ చేశారు షారూఖ్‌. ఇది వైరల్‌గా మారింది. 

దీనికి విఘ్నేష్‌ స్పందిస్తూ, అవును సార్‌ చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ సినిమాలో మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ ఉందని కూడా విన్నాను. ఆమె రొమాన్స్ రాజు నుంచి నేర్చుకుంది. మీతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలనే కల నెరవేరినందుకు హ్యాపీగా ఉంది. ఇది గ్లోబల్‌ వైడ్‌గా భారీ సక్సెస్ సాధించాలి` అని తెలిపారు విఘ్నేష్‌ శివన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టంట వైరల్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. 

Scroll to load tweet…

షారూఖ్‌ ఖాన్‌, నయనతార, దీపికా పదుకొనె, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన `జవాన్‌` చిత్రం ట్రైలర్‌ రెండు రోజుల క్రితం విడుదలై ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న తెలుగు, తమిళం, హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి అట్లీ దర్శకుడు.ఈ సినిమాతో అట్లీ, నయనతార బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.