విషాదంః `సాహో` నటుడు బిక్రమ్ జీత్ కరోనాతో కన్నుమూత..
కరోనాతో మరో నటుడు తుదిశ్వాస విడిచారు. `సాహో`లో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన నటుడు బిక్రమ్ జీత్ కన్వర్పాల్ శనివారం మృతి చెందారు.
కరోనా విలయతాండవానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో నటుడు తుదిశ్వాస విడిచారు. `సాహో`లో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన నటుడు బిక్రమ్ జీత్ కన్వర్పాల్ శనివారం మృతి చెందారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. మెయిన్ స్ట్రీమ్ నటుడిగా రాణిస్తున్న బిక్రమ్ జీత్ కన్వర్పాల్ మృతితో బాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నాయి.
దర్శకుడు అశోక్ పండిత్ స్పందిస్తూ, `అతి చిన్న వయసులోనే బిక్రమ్ జీత్ మనందరిని విడిచి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది` అంటూ భావోద్యేగానికి లోనయ్యారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ బిక్రమ్ 2003లో నటుడిగా కెరీర్ను ప్రారంభించారు. హిందీలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్సిరీస్ల్లో నటించి ఆకట్టుకున్నాడు. అద్బుతమైన టాలెంటెడ్తో యాక్టర్గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో రామ్చరణ్ `జంజీర్`, రానా `ఘాజీ అటాక్`, ప్రభాస్ `సాహో` వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. హిందీలో ఆయన `పేజ్ 3`, `కార్పొరేట్`, `డాన్`, `హైజాక్`, `నాకౌట్`, `మర్డర్ 2`, `జోకర్`, `జబ్ తక్ హై జాన్`, `గ్రాండ్ మస్తీ`, `హర్రర్ స్టోరీ`, `హీరోయిన్`, `2 స్టేట్స్`, `అంజాన్`, `ప్రేమ రతన్ ధ్యాన్ పాయో` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మరణ వార్త విని బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు తెలుగు నటీనటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.